జ‌నంలోకి జ‌గ‌న్‌.. ముహూర్తం వాయిదా.. !

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. జ‌నంలోకి వ‌స్తాన‌ని గ‌తంలో రెండు మూడు సార్లు ప్ర‌క‌టించారు. కానీ, జ‌నంలోకి రాలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయన వాయిదా వేస్తున్నారు. తాజాగా గ‌త నెల‌లో కూడా డేట్ ఫిక్స్ చేశారు. వ‌చ్చే ఏడాది వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని.. ఆ రోజు నుంచి జ‌నంలోకి వ‌స్తాన‌ని చెప్పారు. కానీ.. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై కూడా డోలాయ‌మానంలో ఉన్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌జ‌ల్లోకి ఎప్పుడు రావాల‌న్న దానిపై ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలిపాయి.

ప్ర‌జ‌ల్లో ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై ఇంకా వ్య‌తిరేక‌త పెర‌గ‌లేద‌ని.. అది లేకుండా ఇప్పుడు జ‌నంలోకి వ‌చ్చినా.. ప్ర‌యోజ‌నం లేద‌ని వైసీపీ అధినేత భావిస్తున్న‌ట్టు లేళ్ల అప్పిరెడ్డి చూచాయ‌గా వ్యాఖ్యానించారు. “వ‌స్తారు.. జ‌నంలోకి రావాల‌నే ఉంది. కానీ, ఇంకా టైం ప‌డుతుంది. ఈ ప్ర‌భుత్వం మాకు వ‌ద్దు అని ప్ర‌జ‌లు భావించాలి క‌దా?!. అప్పుడు వ‌స్తారు. అప్ప‌టి లోపు ఇత‌ర కార్య‌క్ర‌మాలు చేస్తారు. ” అని ఆయ‌న మీడియా మిత్రుల వ‌ద్ద ఆఫ్‌ది రికార్డుగా వ్యాఖ్యానించారు. అయితే.. దీనికి మ‌రో కార‌ణం కూడా ఉంద‌ని తెలిసింది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 60-80 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి అధ్వానంగా ఉంది. ఈ క్రమంలో ఇప్ప‌టికిప్పుడు ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చినా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ బ‌లంగా లేక‌పోతే.. అనుకున్నంత జోష్ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలిసింది. అందుకే.. పార్టీలో ముందు సెట్ రైట్ చేసుకుని.. త‌ర్వాత ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక‌, మ‌రోవైపు.. ప్ర‌స్తుతం జ‌గ‌న్ జ‌నంలోకి వ‌చ్చినా.. ఎన్నిక‌ల‌కు నాలుగేళ్ల స‌మ‌యం ఉంది. ఈ క్ర‌మంలో ఇప్పుడే వ‌స్తే.. ఎన్నిక‌ల నాటికి ఆ జోష్ నిలిచి ఉంటుందా? అనేది సందేహం.

ఇది కూడా జ‌గ‌న్‌-జ‌నం అనే వ్యూహానికి ముందరి బంధం వేస్తోంది. మ‌రోవైపు.. సొమ్ముల స‌మ‌స్య కూడా వెంటాడుతోంద‌ని అంటున్నారు. ఒక్క‌సారి జ‌గ‌న్ జ‌నంలోకి వ‌స్తే.. ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత మొత్తం భ‌రించేందుకు నాయ‌కులు ఇప్పుడు సిద్ధంగా లేరు. గ‌త ఎన్నిక‌ల్లోనే ఎక్కువ‌గా ఖ‌ర్చు చేసి ఉండ‌డం.. ప్ర‌స్తుతం ఏడాదికాలంగా కేసులు, కోర్టుల‌తో ఉన్న‌ది ఊడ్చుకుపోయిన నేప‌థ్యంలో కొంద‌రు నాయ‌కులు ఖ‌ర్చుకు కూడా వెనుకాడుతున్నారు. మెజారిటీ నాయ‌కుల వ‌ద్ద సొమ్ములు లేవు. ఈ క్ర‌మంలో ఈ కేసులు కూడా కొలిక్కి వ‌చ్చే వ‌రకు జ‌గ‌న్ తాడేప‌ల్లికి మాత్ర‌మే ప‌రిమితం అయ్యే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం.