భాగ్య‌న‌గ‌రంలో కాల్పులు… సీపీఐ నేత మృతి

ఇటీవ‌ల ద‌శాబ్ద కాలంలో ప్ర‌శాంతంగా ఉన్న భాగ్య‌న‌గ‌రంలో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. మార్నింగ్ వాక్ కు వచ్చిన క‌మ్యూనిస్టు నాయ‌కుడే ల‌క్ష్యంగా కొంద‌రు దుండ‌గులు.. తుపాకీల‌తో కాల్పులు జ‌రిపారు. దీంతో హైద‌రాబాద్ న‌గ‌రం యావ‌త్తు పొద్దు పొద్దున్నే ఉలిక్కి ప‌డింది. అస‌లేం జ‌రిగిందంటూ.. అందరూ ఆరా తీశారు. వాస్త‌వానికి తెలంగాణ‌లో తుపాకీ సంస్కృతి లేదు. తుపాకులు ఉన్న నాయ‌కులు ఉన్నా.. ఎప్పుడూ వాటిని బ‌య‌ట‌కు కూడా తీసిన‌ట్టు ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

కానీ.. తాజాగా మంగ‌ళ‌వారం ఉద‌యం మ‌ల‌క్ పేట‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న యావ‌త్ హైద‌రాబాదీల‌ను ఉలికిపాటుకు గురి చేసింది. మలక్‌పేటలోని శాలివాహన నగర్‌ పార్క్‌లో జ‌రిగిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. మార్నింగ్ వాక్ కోసం.. వెళ్లిన సీపీఐ రాష్ట్ర నేత చందు నాయక్‌(43)పై గుర్తు తెలియని దండు గులు తుపాకీతో కాల్పులు జరిపారు. కారులో ఒక్క ఉదుట‌న దూసుకు వ‌చ్చిన దుండ‌గులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు.

అయితే.. ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో చందు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న‌కు భార్య‌, కుమార్తె కూడా ఉన్నారు. వారు కూడా ఈ ఘ‌ట‌న స‌మ‌యంలో మార్నింగ్ వాక్‌లోనే ఉన్నారు. అయితే.. వారు కూడా భ‌యంతో అక్క‌డ నుంచి ప‌రార‌య్యారు. ఘ‌ట‌న జ‌రిగిన కొద్ది సేప‌టికే పోలీసులు రంగంలోకి దిగి.. ఆధారాలు సేక‌రించారు. మ‌రోవైపు.. పోస్టుమార్ట‌మ్ కోసం.. మృత దేహాన్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఏంటి కార‌ణం?

కాల్పుల ఘ‌ట‌న‌పై భిన్న‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి. భూములు, పొలాల విష‌యంపై పంచాయ‌తీలు చేసిన నేప‌థ్యంలోనే ప్ర‌త్య‌ర్థి ప‌క్షం చందుపై క‌క్ష పెంచుకుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌పై కాల్పులు జ‌రిగాయ‌ని అంటున్నారు. మ‌రోవైపు.. వివాహేత‌ర సంబంధం కూడా కార‌ణ‌మ‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. ఇదిలావుంటే.. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లికి చెందిన చందు.. సీపీఐలో 20 ఏళ్లుగా ఉన్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి నాయ‌కుడిగా ఎదిగారు.