తేడా కొడితే బీఆర్ఎస్‌లోకే.. ‘కొండా’ పెద్ద వ్యూహం?

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కాంగ్రెస్ నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు పెరిగిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా కొండా ముర‌ళి, మంత్రి కొండా సురేఖ దంప‌తుల వ్య‌వ‌హార శైలితో స్థానిక నాయ‌కులు ర‌గులుతున్నారు. ఈ ఇద్ద‌రిపై అధిష్టానానికి పిర్యాదులు కూడా చేశారు. ఇప్ప‌టికే రెండు సార్లు వీరిని విచారించిన అధిష్టానం.. గ‌ట్టిగానే స‌మాధానం చెప్పింది. స్థానికంగా అంద‌రినీ క‌లుపుకొని పోవాల‌ని సూచించింది. వివాదాల‌కు క‌డుదూరంగా ఉంటూ.. పార్టీని డెవ‌ల‌ప్ చేయాల‌ని కూడా ఆదేశించింది. అయితే.. కొండా ముర‌ళి మాత్రం పైకి విన్న‌ట్టు చెబుతున్నా.. తెర‌చాటున మాత్రం ఆయ‌న దూకుడు వ‌ద‌ల్లేదు.

మ‌రోవైపు..కొండా వార‌సురాలిగా సుస్మిత కూడా జెండా ఎత్తారు. సోష‌ల్ మీడియాలో ఆమె పోస్టులు పెడుతున్నారు. ప‌ర‌కాల నుంచి తాను పోటీకి రెడీ అవుతున్నాని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇలా అధిష్టానం ఆదేశాల‌కు విరుద్ధంగా వార‌సులు జెండా ఎత్తడం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రంగంలోకి దిగుతాన‌ని చెప్ప‌డం వంటివి సీరియ‌స్ ప‌రిణామాలు. ఇదే విష‌యంపై కొండా దంప‌తులు వ్యాఖ్యానించాల్సివ‌స్తే.. త‌ప్పుకొంటున్నారు. ఆమె త‌మ బిడ్డ అని చెబుతూనే ఆమె కూడా స్వేచ్ఛ‌గా నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఆదివారంకూడా సుస్మిత త‌న పంథాను మ‌రోసారి ప్ర‌క‌టించారు.

మొత్తంగా చూస్తే.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కొండా కుటుంబం చేస్తున్న రాజ‌కీయాలు.. ఆధిప‌త్య పోరు వంటివాటిని ఎక్క‌డా త‌గ్గించ‌డం లేదు. తాను ఎన్నో కేసులు ఎదుర్కొన్నాన‌ని.. అయినా ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌లేద‌ని కూడా కొండా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు కొండా వ్యూహం ఏంటి? అనేది కూడా.. చ‌ర్చ‌కువ స్తోంది. అవ‌కాశం-అవ‌స‌రం.. అనే రెండు ప‌ట్టాల‌పైనే ఎవ‌రి రాజ‌కీయం అయినా.. ముందుకు సాగుతుంది. ఈ రెండుకుద‌ర‌కే.. గ‌తంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి.. త‌ర్వాత బీఆర్ ఎస్‌లోకి కొండా ఫ్యామిలీ వ‌చ్చింది. త‌ర్వాత‌.. మ‌ళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే.. బీఆర్ఎస్ నుంచి త‌మ చిర‌కాల ప్ర‌త్య‌ర్థుల‌ను కాంగ్రెస్‌లోకి తీసుకోవ‌డాన్ని.. క‌నీసం త‌మ‌కు చెప్ప‌కుండానే క‌డియం శ్రీహ‌రి వంటివారిని పిలుచుకోవ‌డాన్ని వారు త‌ప్పుబ‌డుతున్నారు. ఇదే.. వివాదాల‌కు, విభేదాల‌కు కార‌ణ‌మైంది. ఇక‌, ఇప్పుడు త‌మ‌కు ఏమాత్రం అవ‌కాశం లేక‌పోయినా.. మ‌రోసారి పార్టీ మారేందుకు కొండా కుటుంబం రెడీ అవుతుంద‌న్న చర్చ సాగుతోంది. అటువైపు బీఆర్ఎస్‌కు కూడా వ‌రంగ‌ల్‌లో కీల‌క నాయ‌కులు చేజారడంతో ప‌ట్టుత‌ప్పింది. ఈ క్ర‌మంలో కొండా కుటుంబాన్ని ఆహ్వానించే అవ‌కాశం ఉంద‌న్న వాద‌నా వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల లోపు ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న చ‌ర్చ ఉంది. ఈ నేప‌థ్యంలోనే కొండా కుటుంబం వెన‌క్కి త‌గ్గ‌డం లేద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.