పులివెందుల రాజ‌కీయాలు చేస్తే తోక‌లు క‌త్తిరిస్తా: బాబు

వైసీపీ నాయ‌కుల‌కు సీఎం చంద్ర‌బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల త‌ర‌హా రాజ‌కీయాలు చేయాల‌ని అనుకుంటే.. వారి తోక‌లు క‌త్తిరిస్తాన‌ని గ‌ట్టిగా చెప్పారు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో అనేక డ్రామాలు ఆడార‌ని అన్నారు. బాబాయి గొడ్డ‌లి పోటును గుండె పోటుగా చెప్పార‌ని.. పైగా దాన్ని త‌న‌కు అంటించే ప్ర‌య‌త్నం చేశార‌ని అన్నారు. అయితే.. అప్ప‌ట్లో వైసీపీ ప‌న్నాగాల‌ను గ్ర‌హించ‌లేక పోయాన‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. అప్ప‌ట్లోనే వారిని జైలుకు పంపించి ఉంటే.. 2019 ఎన్నిక‌ల్లో నూ విజ‌యం టీడీపీదే అయి ఉండేద‌ని వ్యాఖ్యానించారు.

తాజాగా సోమ‌వారం రాత్రి విశాఖ‌ప‌ట్నంలో టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో చంద్ర‌బాబు ఓ ఫంక్ష‌న్ హాల్‌లో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను బుజ్జ‌గించారు. ప‌ద‌వులు ద‌క్క‌ని వారు అలుగుతున్నార‌ని.. కానీ, అలా అల‌గ‌డం వ‌ల్ల సాధించేది ఏమీ లేద‌న్నారు. జెండా మోసేవారికి.. మోసిన జెండా వ‌దిలి పెట్టకుండా ఉన్న‌వార‌కి పార్టీలో ప్రాధాన్యం ఎప్ప‌టికీ ఉంటుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. పార్టీకి కార్య‌క‌ర్త‌లే అండ అని పేర్కొన్నారు. దేశంలో ఏ పార్టీకీ లేనంత స‌భ్య‌త్వం టీడీపీకి మాత్ర‌మే ఉంద‌ని చెప్పారు. దాదాపుకోటి మందికి పైగా టీడీపీ స‌భ్యత్వం తీసుకున్నార‌ని.. ఇదొక హిస్ట‌రీ అని పేర్కొన్నారు.

టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో త‌న‌ది రాజ‌కీయ బంధం కాద‌ని.. కుటుంబ సంబంధ‌మ‌ని చంద్ర‌బాబు చెప్పారు. వారికి ఏకష్టం వ‌చ్చినా.. తాను అల్లాడిపోతాన‌ని చెప్పారు. అందుకేపార్టీ స‌భ్య‌త్వం తీసుకున్న కుటుంబాలు ఆనందంగా ఉండాల‌న్న ఉద్దేశంతో వారికి.. బీమా సౌక‌ర్యం క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. కీల‌కమైన స‌మ‌యం ఉందేన‌ని..పార్టీ కార్య‌క‌ర్త‌లు.. గ‌ర్వించేలా ఏడాదిలో అన్నీ మంచి ప‌నులు చేసి ప్ర‌జ‌ల మ‌న‌సులు చూర‌గొన్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఏడాది కాలంలో పింఛ‌న్లు పెంచామ‌ని, త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని అమ‌లు చేసి.. ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు ఉన్నా.. వారంద‌రికీ ఇస్తున్నామ‌ని.. ఈ విష‌యాల‌ను కార్య‌క‌ర్త‌లు ఇంటింటికీ తిరిగి ప్ర‌చారం చేయాల‌ని సూచించారు.

“రాష్ట్రమంతా ఒక ఎత్తు.. విశాఖ ఒక ఎత్తు. మంచివాళ్లు ఎక్కువగా ఉన్న నగరమిది” అని చంద్ర‌బాబు విశాఖ‌పై కీల‌క వ్యాఖ్యలు చేశారు. గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులు అంటూ.. ప్ర‌చారం చేసినా విశాఖ ప్ర‌జ‌లు న‌మ్మ‌లేద‌న్నారు. అందుకే ఆ పార్టీకి విశాఖ‌లో ఒక్క‌సీటు కూడా ద‌క్క‌లేద‌న్నారు. విశాఖ‌ను అద్భుత న‌గ‌రంగా తీర్చిదిద్ద‌నున్న‌ట్టు తెలిపారు. “భోగాపురం ఎయిర్‌పోర్టు సిద్ధమవుతోంది. త్వరలోనే విశాఖలో మెట్రో వస్తుంది. గూగుల్‌ డేటా హబ్‌ విశాఖకు రానుంది. అనకాపల్లి జిల్లాలో మిత్తల్‌ స్టీల్‌ప్లాంట్‌ వస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడింది ఎన్డీయే ప్రభుత్వమే. ఇటీవల ఆర్థిక ప్యాకేజీ కూడా వచ్చింది. అభివృద్ధిలో రాజీపడను. రైల్వే జోన్‌కు భూమి కేటాయించాం.” అని చంద్ర‌బాబు చెప్పారు.