నితీశ్‌కు అస‌లు సిస‌లు ప‌రీక్ష ఇప్పుడే!

బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిశాయి. ఫ‌లితం కూడా దాదాపు క్లారిటీ వ‌చ్చేసింది. ఎన్డీయే ప‌క్షం జేడీయూ-బీజేపీల కూట‌మి.. మేజిక్ మార్కును సాధించాయి. సో.. ఈ కూట‌మి స‌ర్కారు అధికారం చేప‌ట్ట‌డం ఖా యం! అదేస‌మ‌యంలో నితీశ్ కుమార్ మ‌రోసారి.. సీఎం కావ‌డం కూడా ఖాయ‌మే!! అనుకుంటున్నారా? అయితే.. అక్క‌డే ఉంది అస‌లు చిక్కు. రాజ‌కీయాలంటేనే వ్యూహం.. పైగా బీజేపీ అనే బ్ర‌హ్మ‌ప‌దార్థం.. స‌ర్వ‌కాల.. స‌ర్వ‌విధ‌..స‌ర్వావ‌స్థ‌ల్లోనూ దేశ‌వ్యాప్తంగా విస్త‌రించాల‌నే ఏకైక భావ‌జాలంతో ముందుకు వెళ్తున్న పార్టీ. అలాంటి పార్టీ.. కుంజ‌ర‌యూధంబు.. దోమ‌కుత్తుక జొచ్చెన్‌ అన్న‌ట్టుగా.. పొత్తులు పెట్టుకుంటోందే త‌ప్ప‌.. త‌న‌కు ఇష్ట‌మై కాదు!

బిహార్‌లోనూ అదే ప‌నిచేసింది. త‌మ‌కు సొంత బ‌లం లేదు. కానీ, వ్యూహ‌క‌ర్త‌, క్లీన్ ఇమేజ్ ఉన్న నితీశ్ కుమార్ అయితే.. బాగుంటుంద‌ని భావించి.. ఆయ‌న‌తో పొత్తుకు సిద్ధ‌మైంది. ఇక‌, ఇప్పుడు బీజేపీకే ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. పోటీ చేసిన స్థానాల్లో 73 చోట్ల బీజేపీ అభ్య‌ర్థులు గెలుపు గుర్రాలెక్కారు. ఇక‌, ఎంతో క్లీన్ ఇమేజ్ ఉన్న ఉత్త‌మ సీఎం నితీశ్ సొంత పార్టీ జేడీయూ కేవ‌లం 43 స్థానాల‌కే ప‌రిమిత మైంది. దీంతో రాష్ట్రంలో అతిపెద్ద రెండో పార్టీగా, కూట‌మిలో ఫ‌స్ట్ పార్టీగా బీజేపీ అవ‌తరించింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి పీఠాన్ని బీజేపీనే ఆశించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది.

దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.. మ‌హారాష్ట్ర‌. ఆ రాష్ట్రంలో చిర‌కాల మిత్రుడు శివ‌సేన‌తో పోటీ చేసిన త‌ర్వాత‌.. ఫ‌లితాల్లో త‌మ‌కు ఎక్కువ సీట్లు రాగానే.. మాకే సీఎం పీఠం అప్ప‌గించాల‌ని బీజేపీ మొండికేయ‌డం, తెల్ల‌వారుజామునే గ‌వ‌ర్న‌ర్‌.. అప్ప‌టిక‌ప్పుడు బీజేపీ నాయ‌కుడు ఫ‌డ‌ణ‌వీస్‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు ర‌మ్మంటూ ఆదేశాలు జారీ చేయ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల‌లో శివ‌సేన బీజేపీతో క‌టీఫ్ చేసుకుని కాంగ్రెస్‌, ఎన్సీపీల‌తో పొత్తుకు సిద్ధ‌మై .. ప్ర‌భుత్వాన్నిలాక్కొస్తోంది. అంటే.. ఇప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వ‌చ్చాయి క‌నుక‌.. ఆది నుంచి చెబుతున్న నితీశే సీఎం అభ్య‌ర్థి అనే వాగ్దానాన్ని ఏ క్ష‌ణంలో అయినా.. గంగలో క‌లిపేసే ప్ర‌మాదం పొంచి ఉంది.

ఇవే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌ల‌ని ప్ర‌క‌టించిన నితీశ్‌కు ఈ ప‌రిణామం ఎదురైతే.. ఏం చేస్తార‌నేది ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌. పోనీ.. ఆయ‌న పోయి పోయి.. మ‌ళ్లీ పాత మిత్రుడు ఆర్జేడీకి స‌పోర్టు చేసి.. బీజేపీతో క‌టీఫ్ చేసుకున్నా.. అక్క‌డ కూడా స‌మ‌స్య‌లే ఉన్నాయి. ఆర్జేడీతో క‌లిసినా.. ఆ పార్టీ చీఫ్ తేజ‌స్వి.. సీఎం పీఠం త‌న‌కే కావాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డం ఖాయం. దీంతో నితీశ్‌కు అక్క‌డ కూడా సీఎం పీఠం ఎక్కే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. పైగా ఆయ‌న విధాన ప‌రిష‌త్ స‌భ్యుడు కావ‌డం మ‌రింతగా ఇబ్బంది పెడుతున్న ప‌రిణామం. ఈ క్ర‌మంలో ఎన్నిక‌లు ముగిసి.. ఓ తంతుకు తెర‌ప‌డినా.. నితీశ్ అనే సోష‌లిస్టు భావ‌జాలం ఉన్న నాయ‌కుడి భ‌విత‌వ్యం మాత్రం మ‌రింత ఉత్కంఠ‌గా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.