ఆంధ్ర ప్రదేశ్ అక్షరమాల ప్రకారం చూస్తే… దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే పైన తొలి స్థానంలో కనిపిస్తుంది. అలాంటి ఏపీకి అన్ని రకాలుగా ప్రాధాన్యం దక్కాల్సిందే. నిధుల కేటాయింపులో అయినా, ఇతరత్రా అభివృద్ధి పనుల్లో అయినా ఏపీకి కేటాయింపులు జరిగిన తర్వాతే ఇతర రాష్ట్రాల జోలికి కేంద్రం వెళ్లాలి. అయితే మొన్నటిదాకా ఈ తరహా పరిస్థితి ఏమీ కనిపించలేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏపీ అడిగింది కాదనే కేంద్ర మంత్రి ఇప్పుడు లేరనే చెప్పాలి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఏపీపై ఓ రేంజిలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
తాజాగా ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని ఏపీలోని సాగర నగరం విశాఖలో మోదీ స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ వేడుక కోసం ఏపీలోని కూటమి సర్కారు భారీ ఏర్పాట్లు చేస్తోంది. మోదీ పాలుపంచుకునే యోగా డేకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కే దిశగా ఏపీ సర్కారు అడుగులు వేస్తోంది. ఈ నెల 21న జరగనున్న ఈ యోగా డేకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయన్న విషయంపై మోదీ మంగళవారం ఆరా తీశారట. యోగా డే దగ్గరపడుతోంది కదా… విశాఖలో ఏర్పాట్లు ఏ మేరకు వచ్చాయన్న విషయంపై ఆయన ఆరా తీశారట.
పహల్ గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ లపై వివిధ దేశాలకు వివరించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాలు తమ పని ముగించగా.. ఆయా బృందాల్లోని సభ్యులకు మోదీ మంగళవారం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో ఏపీ నుంచి టీడీపీ యువ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సభ్యుడిగా ఉండగా… ఈ విందుకు హాజరైన ఆయనతో మోదీ మాట కలిపారట. యోగా డే ఏర్పాట్లు విశాఖలో ఎలా జరుగుతున్నాయి? ఏ దశ వరకు వచ్చాయి? నిర్ణీత సమయంలోగా ఏర్పాట్లు పూర్తి అవుతాయా? అంటూ మోదీ ఆరా తీశారట.
మోదీ ఆరాతో లావు గొంతు సవరించుకునేంతలోనే తిరిగి మోదీనే చాలా విషయాలను ప్రస్తావించారట. విశాఖలో యోగా డే ఏర్పాట్లు మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లుగా తనకు తెలిసిందని మోదీ చెప్పారట. అందులో భాగంగా లోకేశ్ అవిశ్రాంతంగా కష్ట పడుతున్నారని కూడా తనకు తెలిసిందన్నారట. ఇక విశాఖలో యోగా డేకు గిన్నిస్ బుక్ లో చోటు దక్కేలా ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా తనకు సమాచారం వచ్చిందని కూడా మోదీ చెప్పారట. మొత్తంగా ప్రశ్నలు మోదీనే వేసి… జవాబులు కూడా మోదీ చెబుతూ సాగిపోవడంతో లావు ఆశ్చర్యపోయారట. అంతేకాకుండా… ఏపీ గురించి మోదీకి ఏ ఒక్కరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయనే స్వయంగా ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఆయా విషయాలపై వివరాలు తెలుసుకుంటున్నారని లావు ఓ అంచనాకు వచ్చారట.