ఖ‌మ్మం పాలిటిక్స్‌లో నాడు తుమ్మ‌ల‌.. నేడు పువ్వాడ‌.. సేమ్ సీన్‌!

తెలంగాణ‌-ఏపీ స‌రిహ‌ద్దు జిల్లాగా ఉన్న ఖ‌మ్మం రాజ‌కీయాల్లో నేత‌లు మారారు. కానీ, రాజ‌కీయ వైఖ‌రులు మాత్రం మార‌లేద‌నే టాక్ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. గ‌తంలో మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు హ‌వా చ‌లాయించారు. ఆయ‌న ఎవ‌రినీ ఎద‌గ‌నిచ్చేవారు కాద‌నే టాక్ ఉంది. అంతేకాదు.. ఆయ‌న అనుమ‌తి లేకుండా.. అధికారులు పూచిక పుల్ల‌ను కూడా క‌ద‌ల‌నిచ్చేవారు కాదు. దీంతో ఏ ప‌ని కావాల‌న్నా.. ఎంత‌టి వారైనా.. తుమ్మ‌ల సార్ అనుమ‌తి కోసం క్యూక‌ట్టేవారు. ఇలా ఓ నాలుగేళ్లు సాగింది. ఈ ప‌రిణామాలు నిల‌బెట్టుకునే క్ర‌మంలో.. తుమ్మ‌ల ప్ర‌య‌త్నాలు సాగించారు.

అయితే, తుమ్మ‌ల‌పై ఎగ‌స్పార్టీగా ఉన్న ఇత‌ర పార్టీల నాయ‌కులు పాలేరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే స‌హా ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ కుమార్‌లు టీఆర్ఎస్ వ్యూహాన్ని ప‌సిగట్టేశారు. ఎన్నాళ్లు ఈ యాత‌న అనుకున్నారో.. ఏమో.. కేసీఆర్ చెంత‌కు చేరిపోయారు. ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితులుగా మార్కులు సంపాయించారు. దీంతో అధికారం మొత్తం ఇప్పుడు మెజారిటీ పార్ట్ పువ్వాడ అజ‌య్‌కే ద‌ఖ‌లు ప‌డ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం తెలంగాణ ర‌వాణా మంత్రిగా ఉన్న పువ్వాడ అజ‌య్‌.. ఖ‌మ్మం జిల్లాను శాసిస్తున్నా ర‌నే వార్త‌లు త‌ర‌చుగా తెర‌మీదికి వ‌స్తున్నాయి.

అన్నీ తానై పువ్వాడ‌ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు వంటివారిని కూడా అధికారులు లెక్క‌చేయ‌డం లేద‌ని.. అంతా మంత్రి గారి క‌నుస‌న్న‌ల్లోనే వ్య‌వ‌హారాలు చక్క‌బెడుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, ఇక్క‌డే.. తుమ్మ‌ల అంశం కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. గ‌తంలో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా ఇలానే చేశార‌ని.. వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను కూడా వ‌దులుకున్నార‌ని.. ఫ‌లితంగా ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయార‌ని అంటున్నారు. సాగిన‌న్నాళ్లు టీఆర్ఎస్‌లో ఏ నాయ‌కుడికైనా బాగానే ఉంటుంద‌ని.. ఒక్క ఓట‌మి ఎదురైతే.. అప్పుడు ప‌రిస్థితి త‌ల్ల‌కిందులై.. వ్య‌క్తిగ‌త ఇమేజ్ కూడా కోల్పోయిన ప‌రిస్థితి ఉంద‌ని నామా వ‌ర్గం చెబుతోంది. అంటే.. ప్ర‌స్తుతం లోలోన ఎంపీ వ‌ర్గం మ‌ధ‌న ప‌డుతున్న సంకేతాలు స్ప‌ష్టంగా తెలుస్తున్నాయి. గ‌తంలో ఇదే ప‌రిస్తితి తుమ్మ‌ల నుంచి నామా వ‌ర్గం ఎదుర్కొంది. ఇప్పుడు పువ్వాడ హ‌వా కొన‌సాగుతోంది. అయితే, ఇది శాశ్వ‌తం కాద‌నేది నామా వ‌ర్గం అంచ‌నా. మ‌రి పువ్వాడ దూకుడు త‌గ్గిస్తారో లేదో చూడాలి.