=

ష‌ర్మిలాగ్ర‌హం: జ‌గ‌న్‌తో పాటు ఈసారి లోకేష్ కూడా!

కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల త‌ర‌చుగా త‌న అన్న‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను విమ‌ర్శించే విషయం తెలిసిందే. సంద‌ర్భం ఏదైనా జ‌గ‌న్‌పై ఆమె విరుచుకుప‌డుతున్నారు. ఇది రాజకీయంగా ఆమెకు బ‌లాన్నిఇచ్చిందా? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. మొత్తానికి ష‌ర్మిలాగ్ర‌హం మాత్రం.. త‌గ్గ‌డం లేదు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థుల జ‌వాబు ప‌త్రాల మూల్యాంక‌నంలో త‌ప్పులు దొర్లాయి. దీంతో 11 వేల మందికి పైగా విద్యార్థుల జ‌వాబు ప‌త్రాల్లో మార్కులు క‌లిశాయి. అస‌లు త‌ప్పిన విద్యార్థులు ఫ‌స్ట్ మార్కులు తెచ్చుకుని పాస‌య్యారు.

ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దుమారం రేపింది. వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి ప్ర‌భుత్వం మ‌ధ్య తీవ్ర రాజ‌కీయ ర‌చ్చ కొన‌సాగుతోంది. మంత్రి నారా లోకేష్‌ను కార్న‌ర్ చేస్తూ.. జ‌గ‌న్‌తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తే.. నారా లోకేష్ కూడా త‌గ్గ‌కుండా.. అంతే ఊపుతో కామెంట్లుచేసి కాక పుట్టించారు. మొత్తంగా ఇరు ప‌క్షాల మ‌ధ్య రాజ‌కీయ వేడి రాజుకుంది. తాజాగా ఈ వివాదంలో ష‌ర్మిల కూడా ఎంట్రీ ఇచ్చారు. జ‌గ‌న్‌తో పాటు లోకేష్‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల రీ కౌంటింగ్ పై జగన్ , లోకేష్ మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉందని ఎద్దేవా చేశారు.

వైసీపీ హయంలో ప్రతి ఏటా రీ కౌంటింగ్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో.. 20 శాతం మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న 30 వేల మందిలో 11 వేల మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే, పేపర్ల మూల్యాంకనంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తుందన్నారు. విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని ఇరు ప‌క్షాల‌పైనా నిప్పులు చెరిగారు.

వాస్తవానికి ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదని, పేపర్లు సరిగ్గా దిద్దలేని వైసీపీ, కూటమి ప్రభుత్వాలేన‌ని ష‌ర్మిల త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. పిల్లల భవిష్యత్ ను నిర్ణయించడంలో ఫెయిల్ అయిన వీళ్ళు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారు? అని ప్ర‌శ్నించారు. 30 వేల మంది విద్యార్థులకు సంబంధించి 60 వేల పేపర్ల రీ కౌంటింగ్ కు వస్తే అందులో 11 వేల మందికి అత్యున్నత మార్కులు వచ్చాయంటే పూర్తిగా మీ ప్రభుత్వ వైఫల్యమేన‌ని ష‌ర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.