టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు మూడో రోజుకు చేరుకుంది. చివరి రోజు మహానాడు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు దాదాపు 5 లక్షల మంది హాజరు కావడంతో కడప మొత్తం పసుపుమయమైంది. ఈ సందర్భంగా ఈ సభలో ప్రసంగించిన మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జెండా లేకుండా పీకేస్తాం అన్న పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని వైసీపీకి చురకలంటించారు. జెండా పీకేస్తాం అని అన్న వారు పార్టీ కార్యాలయానికి టులెట్ బోర్డు పెట్టుకొనే పరిస్థితి వచ్చిందని చురకలంటించారు. వై నాట్ 175 అన్న పార్టీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారని, ఇప్పుడు ప్రజలు వారిని ఫుట్ బాల్ ఆడుకుంటున్నారని చురకలంటించారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని, దానికి బదులుగా జగన్ ను ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టి లాక్ చేశారని సెటైర్లు వేశారు. టీడీపీ నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరని, ట్రెండ్ సెట్ చేస్తారని లోకేష్ పంచ్ డైలాగ్ వేశారు. సినిమా స్క్రీన్ అయినా… పొలిటికల్ స్క్రీన్ అయినా ఒకే లెజెండ్ ఎన్టీఆర్ అని లోకేష్ చెప్పారు.
వైసీపీ నేతలు ఎర్ర బుక్కు అని ఏడుస్తున్నారని చెప్పిన లోకేశ్….ఎందుకయ్యా ఏడుస్తున్నారు అంటూ చురకలంటించారు. తాను కేవలం చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటానని చెప్పానని, అలాగే చేస్తున్నానని అన్నారు. ఈ రోజు ఎర్ర రంగు చూస్తూనే వణికిపోయే పరిస్థితికి వైసీపీ నేతలు వచ్చారని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ అంటే ఒకడికి గుండెపోటు వచ్చిందని, ఒకడు బాత్రూంలో జారి చేయి విరగ్గొట్టెుకున్నాడని అన్నారు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికీ తెలుసు అని లోకేశ్ విమర్శలు గుప్పించారు.
తల్లిని చెల్లిని మెడబెట్టి గెంటేసింది ఎవరు? సొంత బాబాయ్ ను లేపేసింది ఎవరు? జే బ్రాండ్ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసింది ఎవరు? అని లోకేశ్ ప్రశ్నించగా…జగన్ అని జనం సమాధానమిచ్చారు.