టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు పసుపుమయమైంది. దేవుని గడప కడపలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు లక్షలాదిగా తరలి వచ్చారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన ప్రసంగం టీడీపీ కార్యకర్తలను ఉద్వేగానికి లోనయ్యేలా చేసింది. పసుపు సింహం, టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య పీక కోస్తున్నా సరే జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు విడిచారని, అటువంటి కార్యకర్తలే పార్టీకి స్ఫూర్తి అని చంద్రబాబు అన్నారు.
కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహిస్తున్నామని, ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన ఇటువంటి కార్యకర్తల స్ఫూర్తి పార్టీని నడిపిస్తోందని చంద్రబాబు చెప్పారు. వైసీపీ విధ్వంసకర పాలనతో రాష్ట్రం సర్వ నాశనం అయిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రాణాలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ పని అయిపోయింది అని మాట్లాడిన వారికి సమాధానం దీటుగా ఇచ్చామని, పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించుకుని అధికారం చేపట్టామని చంద్రబాబు అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి సాధించిన విజయం అసామాన్యమైనదని, అందుకు పసుపు సైనికులే కారణమని చంద్రబాబు చెప్పారు. ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఈ గెలుపు సాధ్యమైందని చంద్రబాబు అన్నారు.
రాజకీయాల్లో విలువలు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. పరీక్షలను ఎదుర్కొన్న ప్రతిసారి విజేతగా నిలిచిన పార్టీ టిడిపి అని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం పార్టీ వర్సిటీలో చదివిన విద్యార్థులున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. టీడీపీ అంటే ఒక బ్రాండ్ అని, నీతినిజాయితీతో రాజకీయాలు చేస్తామని చంద్రబాబు చెప్పారు.
సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి ఇలా ప్రతి దానికి టీడీపీనే ట్రెండ్ సెట్టర్ అన్నారు. నిరుద్యోగులను ఐటీ ఉద్యోగులుగా మార్చిన ఘనత మన పార్టీదేనని చంద్రబాబు అన్నారు. బడుగు బలహీన వర్గాలకు అధికారం అందించిన మొదటి పార్టీ టీడీపీ అని చెప్పారు. 3 పార్టీలు కూటమిగా కలిసి నడవాలని, కలిసి గెలవాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.