“నేను శ్రీలంకకు చెందిన వ్యక్తినే. కానీ, అక్కడ నాప్రాణాలకు ముప్పుంది. కాబట్టి.. ఇక్కడే తలదాచుకుంటాను. ఇక్కడే ఉండిపో తాను. దేశాన్ని గౌరవిస్తాను. నాకు ఇక్కడ శాశ్వత ఆశ్రయం కల్పించండి” అని కోరిన వ్యక్తిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “మా దేశం ఎవరికి పడితే వారికి ఆశ్రయం కల్పించేందుకు.. ధర్మసత్రం కాదు. ఎక్కడెక్కడ నుంచో వచ్చి.. ఇక్కడ తల దాల్చుకోవడానికి శరణార్థి శిబిరం కూడా కాదు. కాబట్టి.. దయచేయండి” అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. సదరు వ్యక్తిని శిక్ష పూర్తయిన తర్వాత..(ఒకవేళ ఇప్పటికే పూర్తయి ఉంటే) తక్షణమే దేశం నుంచి పంపేయాలని అధికారులను ఆదేశించింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వస్తున్నారని.. మరో దేశంలో దాడులు జరుగుతున్నాయని (పరోక్షంగా పాకిస్తాన్, అఫ్గాన్) ఇక్కడకు వచ్చేస్తున్నారని.. ఇలా ఎంత మందికి ఈ దేశం ఆశ్రయం కల్పిస్తుందని ప్రశ్నించింది. దేశం అంటే.. పుష్పక విమానం కాదు.. ఎంత మంది వచ్చినా.. మరొకరికి చోటు ఉండడానికి అని సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశ భక్తి అంటే.. పుట్టిన దేశంపై ఉండాలని.. పొరుగు దేశంపై కాదని వ్యాఖ్యానించింది. భారత దేశంలోనే 140 కోట్ల మందికిపైగా ప్రజలు ఉన్నారని.. ఇక్కడి వారితోనే దేశం విలసిల్లుతుందని.. పొరుగు దేశాల పౌరులతో ప్రయోజనం లేదని వ్యాఖ్యానించింది.
విషయం ఏంటి?
శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి(42) అక్కడి నిషేధిత ఎల్టీటీఈలో పనిచేశాడు. దీంతో అతను శ్రీలంక నుంచి పారిపోయి తమిళనాడు కు చేరుకున్నాడు. ఇక్కడి అమ్మాయినే వివాహం చేసుకున్నాడు. అయితే.. కొన్నాళ్లకు గుట్టు బయట పడి.. పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమిళనాడు స్థానిక కోర్టు.. అతనికి పదేళ్ళ కఠిన కారాగారం విధించింది. దీనిని అతను హైకోర్టులో సవాల్ చేయగా.. ఈ శిక్షను ఏడేళ్లకు కుదించింది. అయితే.. శిక్ష పూర్తయిన తర్వాత దేశం విడిచి వెళ్లాలని షరతు విధించింది. దీనిని సవాల్ చేస్తూ.. సదరు వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత.. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
ఇతర దేశాల పౌరులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ధర్మ సత్రం కాదని.. ఎవరి పౌరులు వారి దేశంలోనే ఉండాలని అంతకు మించి వారికి సొంత దేశాల్లో ప్రాణ భయం ఉందని తెలిస్తే.. వేరే ఏదైనా దేశానికి వెళ్లిపోవాలని తేల్చి చెప్పింది. భారత దేశంలో ఇప్పటికే జనాభా పెరిగిందని.. ఇతర దేశాలకు చెందిన వారు ఇక్కడ ఆశ్రయం పొందడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఒకరికి ఆశ్రయం కల్పిస్తే.. దీనినే అదునుగా తీసుకుని ప్రపంచం మొత్తం భారత్నే ఆశ్రయించే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తిని ఏడేళ్ల శిక్షాకాలం పూర్తయ్యాక శ్రీలంక అధికారులకు అప్పగించాలని ఆదేశించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates