ఆపరేషన్ సిందూర్ లో భాగంగా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు, అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే మురళీ నాయక్ పార్థివ దేహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.50 లక్షల ఆర్థిక సాయానికి తోడు పవన్ వ్యక్తిగతంగా రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
మురళీ నాయక్ కుటుంబానికి పవన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసానిచ్చారు. ఏపీ ప్రభుత్వం తరఫున మురళీ నాయక్ కుటుంబానికి రూ. 50 లక్షల తక్షణ ఆర్థిక సాయాన్ని పవన్ ప్రకటించారు. అమర జవాను మురళీ నాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. జిల్లా కేంద్రంలో మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం అందజేస్తామన్నారు. కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
మురళీ నాయక్ కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు. దేశం కోసం మురళీనాయక్ చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని, యువతకు మురళీ త్యాగం స్ఫూర్తిదాయకమన్నారు. కాగా, మురళీ నాయక్ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా తన నెల జీతాన్ని ఆర్థిక సహాయంగా ప్రకటించారు. మే 12న మురళీ నాయక్ కుటుంబ సభ్యులను బాలయ్య పరామర్శించి సాయం అందించనున్నారు.