టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు లక్షిత రేఖలు గీశారు. రెండు కీలక లక్ష్యాలను ప్రతి ఒక్కరూ సాధించాలన్నారు. పార్టీ పరంగా అంతా బాగుందని.. పైవాళ్లే చేసుకుని పోతారని కింది వారు అనుకుంటే పొరపాటేనని అన్నారు. పార్టీలో ప్రతి యూనిట్, ప్రతిక్లస్టర్లో ఏం జరుగుతున్నా.. తమకు తెలుసునని చెప్పారు. మైటీడీపీ యాప్ ద్వారా ప్రతి విషయాన్నీ పార్టీలో చర్చిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉందని ఎవరూ అనుకోవద్దన్నారు. ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు.
ఇంటింటికీ కార్యక్రమం కొన్ని చోట్ల బాగానే చేస్తున్నా.. మరికొన్న చోట్ల మాయ చేస్తున్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చేస్తున్న డీఎస్సీ దుష్ప్రచారాన్ని ఎంత మంది తిప్పికొట్టారని ఆయన ప్రశ్నించారు. తనకు అన్నీ తెలుసునని.. ఎవరు ఎక్కడ ఎలా స్పందిస్తున్నారో.. ఏం చేస్తున్నారో.. అన్నీ గమనిస్తున్నానని ఆయన చెప్పారు. పార్టీ పరంగా లక్ష్యాలను పూర్తి చేయడంపైనే నాయకులు కార్యకర్తలు దృష్టి పెట్టాలన్నారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు.
వైసీపీ చేస్తున్న దుర్మార్గాలను ఎప్పుడో ఎన్నికల సమయంలో ప్రస్తావించాలని చేతులు ముడుచుకోవద్దని పార్టీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు యూనిట్ ఇంచార్జ్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ చేస్తున్న డీఎస్సీ దుష్ర్పచారంపై ఆయన స్పందిస్తూ.. దీనిని తిప్పుకొట్టడం లో టీడీపీ క్షేత్రస్థాయి నాయకులు వెనుకబడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎప్పుడో ఏదో చేస్తాం.. అని అనుకుంటే కుదరదన్నారు. మంచికన్నా చెడు ముందుగా వెళ్లిపోతుందని.. దీనిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు.
ఇక, ఎన్నికలకు ఇప్పటి నుంచే రెడీ కావాలన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు అపూర్వమైన విజయం అందించారని చంద్రబాబు చెప్పారు. ఆ విజయానికి కొనసాగింపుగా 2029 ఎన్నికలు ఉండాలనిసూచించారు. అంతేకాదు..మెజారిటీలు పెరగాలే తప్ప.. తగ్గకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటి నుంచే ప్రబుత్వం చేస్తున్న మంచిని, సంక్షేమ కార్యక్రమాలు పెట్టుబడుల ద్వారా వచ్చే ఉద్యోగాలు.. ప్రజలకు కలుగుతున్న మేలును వివరించాలన్నారు. అదేసమయంలో గొడ్డలి పార్టీ నైజాన్ని, గంజాయి బ్యాచ్ చేస్తున్న దుర్మార్గాలను కూడా ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగకపోతే.. మున్ముందు ఇబ్బంది పడతారని తనదైన శైలిలో చంద్రబాబు హెచ్చరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates