మీరైనా న్యాయం చేయండి: రాష్ట్ర‌ప‌తికి వివేకా కుమార్తె లేఖ‌

“మేడమ్‌.. మీరైనా నాకు న్యాయం చేయండి.“ అంటూ 2019లో దారుణ హ‌త్య‌కు గురైన‌ వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత తాజాగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముకు బ‌హిరంగ లేఖ రాశారు. ఈ లేఖ‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌, సీఎం చంద్ర‌బాబుకు కూడా ఆమె పంపారు. ఈ లేఖ‌లో 2019 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వివేకా దారుణ హ‌త్య‌పై జ‌రిగిన విచార‌ణ‌లు.. తాను ఎన్నిసార్లు న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించిందీ.. స‌మ‌గ్రంగా వివ‌రించారు.

ఇదే స‌మ‌యంలో వివేకా హ‌త్య‌కు సంబంధించి `తొలి స‌మాచారం` జ‌గ‌న్‌కు రావ‌డం వెనుక ఉన్న రీజ‌నేంట‌నేది తెలియాల్సిన అవ‌స‌రం కుమార్తెగా త‌న‌కు ఉంద‌న్నారు. త‌న తండ్రి దారుణ హ‌త్య‌పై లోతైన విచార‌ణ చేయ‌డం లేద‌ని ఆమె ఆరోపించారు. అంతేకాదు.. జ‌గ‌న్‌ను విచారించాల్సి ఉంద‌ని గ‌తంలో సీబీఐ త‌న అఫిడ‌విట్ లోనే పేర్కొంద‌న్న సునీత‌.. కానీ, త‌ర్వాత ఆయ‌న‌ను క‌నీసం ముట్టుకోలేద‌ని పేర్కొన్నారు. ఆయా విష‌యాల‌పై త‌గు న్యాయం చేయాల‌ని.. ఓ మ‌హిళ‌గా, అమ్మ‌గా త‌న ఆవేద‌న‌ను అర్ధం చేసుకోవాల‌ని సునీత త‌న లేఖ‌లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును కోరారు.

లేఖ‌లోని ముఖ్యాంశాలు ఇవీ..

+ వివేకా హ‌త్య కేసులో మూడు కీల‌క అంశాలు ఉన్నాయి. 1) ఆయుధం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది. 2) డీల్ చేసుకున్న‌ సొమ్ములు ఎవ‌రి ద్వారా వ‌చ్చాయి. 3) కుట్ర కోణం ఏంటి. ఈ మూడు అంశాలే ఈకేసులో కీల‌కం. అయితే..వీటిపై లోతైన ద‌ర్యాప్తు చేయ‌డం లేదు. నేను(సునీత‌) అనేక కోర్టుల‌ను ఆశ్ర‌యించింది కూడా వీటి కోస‌మే. కానీ, నేర తీవ్ర‌త గురించి స‌మ‌గ్ర విచార‌ణ చేయ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప‌క్క‌న పెట్టి స్వతంత్రంగా వ్య‌వ‌హ‌రించే హోం శాఖ అధికారి ద్వారా మ‌రోసారి ద‌ర్యాప్తు చేయించాలి.

+ న్యాయం కోసం.. ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నా. మానాన్న చనిపోయిన‌ప్పుడు తొలి ఫోన్ జ‌గ‌న్‌కే వ‌చ్చింది. ఈ విష‌యాన్ని సీబీఐ కూడాత‌న అఫిడ‌విట్‌లో స్ప‌ష్టం చేసింది. కానీ, ఆయ‌న‌ను విచారించ‌డం ల‌దేఉ. మానాన్న‌ మరణవార్త మొదట ఎలా బయటకు వచ్చిందనేది కేసుకు కీలకం. లోతైన దర్యాప్తు చేయాల‌న్న నా అభ్య‌ర్థ‌ను విచార‌ణ కోర్టు(హైద‌రాబాద్‌లోని సీబీఐ కోర్టు) పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కేసులో ఎవ‌రి పాత్ర ఉన్నా.. వాస్తవాలు బహిర్గతమయ్యేలా చూడాలి. ఈ దారుణంలో జగన్‌ పాత్రను విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ స్ప‌ష్టం చేసింది. కాబ‌ట్టి ఆయ‌న‌ను విచారించాలి. కానీ, ఈ దిశ‌గా ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌డం లేదు.