మోడీని చంపేస్తామ‌న్న ఉగ్ర‌వాది హ‌తం..

నాలుగేళ్ల కింద‌ట మోడీని చంపేస్తామ‌ని.. ఆయ‌న త‌ల తెచ్చిన వారికి బ‌హుమానం ఇస్తామ‌ని ల‌ష్క‌రే తాయిబా ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన ముద‌స్స‌ర్ ప్ర‌క‌ట‌న గుర్తుందా? అప్ప‌ట్లో తీవ్ర క‌ల‌కలం రేపిన ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌.. జ‌మ్ము క‌శ్మీర్‌పై కేంద్రం సంపూర్ణంగా దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, స‌హా.. జ‌మ్ము క‌శ్మీర్‌లోని ల‌ద్ధాక్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

అప్ప‌ట్లో అలా మోడీని చంపేస్తామ‌ని బెదిరించి, ప్ర‌క‌ట‌న‌లు చేసిన ల‌ష్క‌రే తాయిబా ఉగ్ర వాద సంస్థ‌కు చెందిన కీల‌క నాయ‌కుడు మ‌ద‌స్స‌ర్ ఖ‌దియాన్ ఖాస్‌.. తాజాగా ఈ నెల 7 అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత చేప‌ట్టిన ఆపరేష‌న్ సిందూర్ దాడిలో హ‌త‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని తాజాగా కేంద్ర హోం శాఖ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. ఈయ‌న‌కు పాక్ ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జ‌రిగిన‌ట్టు కూడా ప్ర‌క‌టించింది.

ఇక‌, ఆప‌రేష‌న్ సిందూర్‌లో మృతి చెందిన అగ్ర ఉగ్ర‌వాద నేత‌ల జాబితాను కూడా కేంద్రం విడుద‌ల చేసింది. వీరిలో ఉగ్ర‌వాద నాయ‌కుడు, జైష్ యే మ‌హ‌మ్మ‌ద్ చీఫ్‌, త‌న కుటుంబాన్ని తాజా దాడిలో మ‌ట్టుబెట్టేలా చేసుకున్న మ‌సూద్ అజ‌హ‌ర్ బావ‌మ‌రిది హ‌ఫీజ్ మ‌హ్మ‌ద్ జ‌మీల్ ఉన్నాడు. అదేవిధంగా విమానం ఐసీ-814 హైజాక్‌(కాంద‌హార్‌) కేసులో కీల‌క పాత్ర పోషించిన మ‌హ్మద్ యూస్ అజార్ కూడా హ‌త‌మ‌య్యాడు. చిత్రం ఏంటంటే.. ఇత‌ను కూడా మ‌సూద్ రెండో బావ‌మ‌రిది.

లష్కరే తొయిబాకు చెందిన ఖలీద్‌ అలియాస్‌ అబు అకాసా కూడా ఆప‌రేష‌న్ సిందూర్‌లో నేల మ‌ట్ట‌మయ్యాడు. ఇత‌ను.. జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో కీల‌క పాత్ర పోషించ‌డంతోపాటు.. ఉగ్ర‌వాద శిక్ష‌ణ శిబిరాలు నిర్వ‌హించాడు. యువ‌త‌ను ఉగ్ర‌వాదంవైపు పురిగొల్పి వారి కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేశాడు. తాజా దాడుల్లో నిలువునా అగ్నికి ఆహుత‌య్యాడు. ఇక‌, మ‌రో ఉగ్ర నేత జైష్ యే మహ్మద్‌కు చెందిన మహ్మద్‌ హసన్‌ ఖాన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.

ఇత‌ను ఉగ్ర‌వాద రెక్కీల‌కు ఆద్యుడుగా పేర్కొంటారు. దాడులు చేసే ప్రాంతాల‌కు మారు వేషంలో వెళ్లి.. రెక్కీ నిర్వ‌హించి.. ప‌రిస్థితులకు అనుగుణంగా ప‌క్కా ప్ర‌ణాళిక‌ను అదిస్తాడ‌ట‌. వీరిని సిందూర్ దాడుల్లో మ‌ట్టుబెట్టిన‌ట్టు కేంద్రం వెల్ల‌డించింది. వీరంద‌రికీ పాకిస్థాన్‌లోని కొంద‌రు మంత్రుల‌తో ప్ర‌మేయం ఉంద‌ని.. వ్యాపార భాగ‌స్వాములుగా కూడా ఉన్నార‌ని అనుమానం వ్య‌క్తం చేసింది.