వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత వీడియోలు, కామెంట్లు, ప్రకటనలను తవ్వితీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీనికి కారణం.. విజయనగరంలో తాజాగా ప్రారంభమైన భోగాపురం(అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రం. దీని ఘనత తమదేనని ఇటీవల కాలంంలో తరచుగా చెబుతున్న జగన్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా మరింత ప్రచారానికి తెరదీశారు. అంతేకాదు.. చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే `థ్యాంక్యూ జగనన్న అంటున్న ఆంధ్రాజనం` అంటూ వైసీపీ పోస్టు చేయడం గమనార్హం.
క్రెడిట్ చోరీ..
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడంలో జగన్ సఫలమయ్యారంటూ వైసీపీ సోషల్ మీడియా పేర్కొంది. భోగాపురం విమానాశ్రయాన్ని ఇప్పుడు ప్రారంభించి.. తొలి ఫ్లైట్ 2026లో ఎగురుతుందని జగన్ ఎప్పుడో చెప్పారని కూడా పేర్కొనడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలను కూడా పోస్టు చేశారు. అయితే.. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఈ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని సోషల్ మీడియాలో ఆరోపించారు. ఇలా.. వైసీపీ శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వరుసగా ట్వీట్లు, పోస్టులు చేస్తూనే ఉండడం గమనార్హం.
పరమార్థం ఏంటి?
భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర రాజకీయ పవనాలు అనూహ్యంగా మారే అవకాశం ఉంది. ఇక్కడి భూములకు ధరలు పెరగడంతోపాటు.. ఉపాధి, విద్యావకాశాలు కూడా భారీగా పుంజుకోనున్నాయి. అదేసమయంలో అంతర్జాతీయ సంస్థలు కూడా ఇక్కడకు రానున్నాయి. దీంతో ఇక్కడి ప్రజలు అధికార కూటమికి అనుకూలంగా మారడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి.. ఎప్పటినుంచో ఉత్తరాంధ్రలో టీడీపీకి సానుకూల వాతావరణం ఉంది. ఇక్కడి నుంచి అనేక మంది నాయకులు విజయం దక్కించుకున్నారు. ఈ ప్రభావం తాజాగా జరిగిన అభివృద్ధితో మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అలెర్ట్ అయినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
తమను తాము కాపాడుకునే క్రమంలోను, తమ ఓటు బ్యాంకును రక్షించుకునే క్రమంలో భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి, ప్రారంభం వంటి వాటిని తమకు అనుకూలంగా వైసీపీ మలుచుకుంటోదన్న చర్చ టీడీపీలోనూ జరుగుతోంది. దీనిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని తాజాగా టీడీపీ నాయకులు హైకమాండ్ నుంచి ఆదేశాలు అందాయి. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని సమర్థ వంతంగా తిప్పికొట్టాలని పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇక, వైసీపీ కూడా భోగాపురం సెంట్రిక్గా జగన్ చేసిన కృషిని ప్రజలకు వివరించాలంటూ నాయకులకు సమాచారం అందించింది. మొత్తంగా ఈవ్యవహారం.. మరో నాలుగైదు రోజులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంగా మారనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates

