అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా,18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ క్రమంలోనే ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అందరికీ నమస్కారం అని తెలుగులో మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 18 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని, ఏపీని మరింత శరవేగంగా అభివృద్ధి చేసేందుకు ఆ ప్రాజెక్టులు దోహదపడతాయని మోదీ అన్నారు.

13 వేల మంది గిరిజన మహిళలు చేసిన థింసా నృత్యం చూసి మధురానుభూతికి లోనయ్యానని మోదీ అన్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం ఒక రికార్డు అని, అంతమందితో థింసా నృత్యం మరో రికార్డు అని అన్నారు. సీఎం చంద్రబాబు విజన్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు మోదీ. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్ వేగా భోగాపురం విమానాశ్రయం నిలుస్తుందని మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకు కొత్త లాంచ్ ప్యాడ్ ఈ భోగాపురం విమానాశ్రయం అని చెప్పారు.

గతంలో విమానాశ్రయాల పేర్లు ఒక కుటుంబానికి సంబంధించినవిగా ఉండేవని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మార్చామని గర్వంగా చెప్పారు. అయోధ్యలో విమానాశ్రయానికి వాల్మీకి పేరు పెట్టామని, పంజాబ్ లో విమానాశ్రయానికి సంత్ రవిదాస్ పేరు పెట్టామని, భోగాపురం విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని చెప్పారు.

ఉడాన్ ద్వారా దేశ విమానాయన రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, ఎంతోమంది పేద ప్రజల కల నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ 12 ఏళ్ల కాలంలో ఎంతో కృషి చేసి దేశంలోని విమానాశ్రయాల సంఖ్యను 74 నుంచి 166కు పెంచామని చెప్పారు.