జీ7 ప్రకటన పాక్ ను ఏకాకిని చేసినట్టే!

పహల్ గాం ఉగ్రదాడిని ప్రోత్సహించి భారత్ తో సున్నం పెట్టుకున్న దాయాదీ దేశం పాకిస్తాన్ కు ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆదుకుంటుందనుకున్న అగ్ర రాజ్యం అమెరికా తాను ఆ పని చేయలేనని బహిరంగంగానే ప్రకటన చేసింది. ఇక దన్నుగా నిలుస్తుందనుకున్న చైనా సైతం ఆదిలోనే పాక్ కు చేయిచ్చేసింది. తాజాగా జీ7 దేశాల కూటమి పాక్ ను ప్రపంచంలోనే ఓ తోడు లభించని ఏకాకిని చేసింది. పహల్ గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన జీ7.. పాక్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది.

జీ7 దేశాల కూటమిలో అగ్రరాజ్యం అమెరికాతో పాటుగా ఇంగ్లండ్, కెనడా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని ఆయా దేశాల కూటమిలలో జీ7కు అత్యదిక ప్రాధాన్యం ఉందని చెప్పాలి. ఎందుకంటే… అటు అమెరికాతో పాటు ఇటు,యూరోప్, ఆసియాలోని కీలక దేశాలు సభ్యులుగా ఉండటమే కాకుండా… ఈ కూటమిలో సభ్య దేశాలన్నీ సంపన్న దేశాలుగానే ఉన్న నేపథ్యంలో ఈ కూటమికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ కూటమితో బారత్ కు ఆది నుంచి సత్సంబంధాలే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్, పాక్ ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని నిశితంగా పరిశీలించిన జీ7 కూటమి శనివారం ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. కూటమి తరఫున ఈ ప్రకటన విడుదలైందంటే… అందులోని దేశాలన్నీ కూడా ఆ ప్రకటనకు ఆమోద ముద్ర వేసి ఉంటాయి. ఈ ప్రకటనలో జీ7 కూటమి ఏమన్నదంటే… పహల్ గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి హేయమైనదని ఆ కూటమి ప్రకటించింది. అంతేకాకుండా భారత్, పాక్ ల మద్య ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.

అయితే ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో తాను ఎంతమాత్రం పాలుపంచుకునే అవకాశమే లేదని జీ7 దేశాల కూటమి తేల్చి చెప్పింది. అయితే పహల్ గాం ఉగ్రదాడే ఈ ఉద్రిక్తతలకు కారణంగా తాము భావిస్తున్నామని ఆ కూటమి అభిప్రాయపడింది. అటు బారత్ అయినా, ఇటు పాక్ అయినా ఉద్రిక్త పరిస్థితులకు స్వస్తి చెప్పి చర్చలతో సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలని అభిలాషించింది. ఉద్రిక్తతల్లోనే కాకుండా ఇరు దేశాల చర్చల్లోనూ తమ సభ్య దేశాలు కలుగజేసుకోవని తెలిపింది. ఈ ప్రకటనతో పాక్ ఏకాకిగా మారిపోయిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.