ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రేపటి నుంచి ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సాయంత్రం ఓ కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా కుటుంబాల నుంచి దరఖాస్తులను ఈ నెలాఖరు దాకా స్వీకరిస్తామని చెప్పిన మంత్రి… వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు.
కొత్త రేషన్ కార్డులతో పాటుగా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో చిరునామా మార్పు, అదనంగా కుటుంబ సభ్యులను చేర్చడం, కొత్తగా రేషన్ కార్డులు తీసుకునే వారి పేర్లను వారి తల్లిదండ్రుల కార్డుల్లో నుంచి తొలగించే కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్లు నాదెండ్ల తెలిపారు. కార్డుల విభజనకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు. రేషన్ కార్డుల్లో మార్పుల కోసం ఇప్పటికే తమకు 3.28 లక్షల మేర దరఖాస్తులు అందాయని ఆయన తెలిపారు. వాటిని కూడా ఈ విడతలోనే సమగ్రంగా పరిశీలన చేసి అవసరమైన మేరకు మార్పులు చేర్పులు చేయనున్నట్లుగా తెలిపారు.
ఈ ప్రక్రియ పూర్తి కాగానే… వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డు దారులతో పాటుగా పాత రేషన్ కార్డు దారులకు కూడా సరికొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు నాదెండ్ల తెలిపారు. కొత్తగా జారీ చేయనున్న ఈ కార్డులు స్మార్ట్ కార్డులను పోలి ఉంటాయని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు దరఖాస్తుల స్వీకరణ ముగిసిన వెంటనే రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే…కొత్తగా జారీ చేసే రేషన్ కార్డులపై ఏ పార్టీ ముద్ర గానీ, రాజకీయ నేతల ఫొటోలు గానీ లేకుండా… రాష్ట్ర ప్రభుత్వ అదికారిక చిహ్నంతోనే కార్డులను చేయనున్నట్లుగా మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ఇక కొత్త రేషన్ కార్డులు, పాత కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం రేపటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను స్వీకరించనున్న ప్రభుత్వం… ఈ నెల 12 నుంచి వాట్పాప్ గవర్నెన్స్ ద్వారా కూడా దరఖాస్తులను స్వీకరించనుంది. మొత్తంగా కొత్త రేషన్ కార్డుల జారీతో రేపటి నుంచి ఏపీలో కోలాహల వాతావరణం కనిపించనుంది.