ప‌వ‌న్ సిఫార‌సు ఓకె చెప్పిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. హిందువుల చిర‌కాల కోరిక‌ను తీర్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. దాదాపు ఐదు ద‌శాబ్దాల‌కు పైగా హిందువుల‌కు చెందిన ధార్మిక సంస్థ‌లు.. త‌మ‌కు నామినేష‌న్ ప‌ద్ధ‌లితో వ‌న‌రులు క‌ల్పించాలని కోరుతున్నాయి. అయితే.. ఇది న్యాయ‌ప‌ర‌మైన వివాదాల‌కు దారి తీస్తుంద‌న్న ఉద్దేశంతో ఏ ప్ర‌భుత్వం కూడా ప‌ట్టించుకోలేదు. పైగా.. ఎవ‌రూ సాహ‌సం కూడా చేయ‌లేదు. ఇత‌ర మ‌తాలవారు కూడా ఇలానే డిమాండ్ చేస్తార‌న్న ఉద్దేశం కూడా ఉంది.

దీంతో హిందూ ధార్మిక సంస్థ‌లు, మ‌ఠాల‌కు చెందిన వారు కూడా.. మౌనంగా ఉన్నారు. అందుకే ప్ర‌భుత్వాలు మారిన‌ప్పుడ‌ల్లా.. హిందువుల‌ను ప‌ట్టించుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో ప్ర‌ధానంగా భూముల కేటాయింపు ఉంది. మ‌ఠాలు, ధార్మిక‌, స్వ‌చ్ఛంద హిందూ సంస్థ‌లు.. త‌మ‌కు భూములు క‌ల్పించాల‌ని.. నామినేష‌న్ విధానంలో ఇవ్వాల‌ని కోరుతున్నాయి. కానీ, ఇది సాకారం కావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కొంద‌రు ప్ర‌తిపాదించారు.

త‌మ‌కు భూములు కేటాయించాల‌ని.. తాము స్వ‌చ్ఛంగా హిందూ వ‌ర్గాల‌కు సేవ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. దీనిపై అధ్య‌య‌నం చేయించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా… 20సంవత్సరాలుగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలకు… బహిరంగ వేలం ద్వారా కాకుండా… నేరుగా లీజు /లైసెన్స్ ద్వారా భూములు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది.

దీనికి సంబంధించిన జీవోను మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ధార్మిక సంస్థ‌లు, మ‌ఠాలు 20 ఏళ్లుగా ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో నిమ‌గ్న‌మై ఉండాల‌ని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ‌లు అందించాల‌ని దానిలో పేర్కొన్నారు. ముఖ్యంగా విప‌త్తుల స‌మ‌యంలో సాయం అందించిన వారికి ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్టు తెలిసింది. కాగా, ఈ నిబంధనల సవరణలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే… జూన్ 1వ తేదీ లోపు దేవాదాయశాఖ కార్యదర్శికి తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చున‌ని జీవో లో పేర్కొన్నారు.