ఈ దేశాలకు వెళ్ళేవారికి పెద్ద షాక్ : పెరగనున్న టికెట్ ధరలు?

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెహల్ గాంలో జరిపిన దాడి పలు అనర్థాలకు దారి తీస్తోంది. ఇప్పటి భారత్, పాక్ మధ్య దౌత్యపరమైన అన్ని రకాల సంబంధాలకు తెర పడిపోగా… ఇరు దేశాలు తమ గగన తలాలను ప్రత్యర్థి దేశాల విమానాలకు మూసివేశాయి. ఫలితంగా అటు పాక్ తో పాటు ఇటు భారత్ కు చెందిన విమాన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. పాక్ ప్రయాణికుల పరిస్థితిని అలా పక్కనపెడితే… భారత్ నుంచి ఉత్తర అమెరికా, ఇంగ్లండ్, దుబాయి వంటి దేశాలకు వెళ్లే ప్రయాణికులకు మాత్రం సమయంతో పాటుగా ప్రయాణ ఖర్చులు కూడా తడిసి మోపెడు కానున్నాయి. ఇప్పటికే భారత వివమానాలకు పాక్ తన గగన తలాన్ని మూసివేసిన నేపథ్యంలో ఈ దేశాలకు వెళ్లే భారత విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మునుపటి కంటే మరింత ఎక్కువ దూరం ప్రయాణించక తప్పడం లేదు. ఫలితంగా ఈ ప్రయాణాలకు మరింత సమయం పడుతుండటంతో పాటుగా త్వరలోనే ప్రయాణ వ్యయాలు కూడా పెరగనున్నాయి.

భారత్ నుంచి విదేశాలు వెళ్లే ప్రయాణికుల్లో అత్యధిక శాతం మంది దుబాయి, ఉత్తర అమెరికా, బ్రిటన్ లకే వెళుతున్నారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రతి రోజు ఈ దేశాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. దుబాయికి వెళ్లే ప్రతి రోజు నడుస్తున్న ఎమిరేట్స్, ఇండిగో, ఎయిర్ ఇండియా సర్వీసుల్లో 90 శాతం అక్యుపెన్సీ ఉండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. ఈ సర్వీసులన్నీ మొన్నటిదాకా పాక్ గగన తలం మీదుగానే తమ గమ్యస్థానాలకు వెళ్లేవి. అయితే పహల్ గాం దాడి నేపథ్యంలో పాక్ కూడా భారత విమానాలకు తన గగన తలాన్ని మూసివేసింది. ఫలితంగా దుబాయి, అమెరికా, బ్రిటన్ వెళ్లే విమానాలన్నీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆయా దేశాలకు చేరుతున్నాయి. ఫలితంగా ప్రయాణ సమయం గణనీయంగా పెరిగిపోయింది. దూరాభారంతో పాటు ప్రయాణ సమయం పెరిగిన నేపథ్యంలో విమానయాన సంస్థలపై మరింత భారం పడుతోంది.

అయితే తాత్కాలికంగా అయితే విమానయాన సంస్థలు ఈ భారాన్ని మోయగలవు గానీ… దీర్ఘకాలంగా అయితే ఆ సంస్థలు ఈ భారాన్ని మోయలేవు కదా. అందుకే భవిష్యత్తులో పెరిగిన దూరాభారం, ప్రయాణ సమయం, అందుకనుగుణంగా పెరిగిన ఇంధన వ్యయాలను విమానయాన సంస్థలు ప్రయాణికులపైనే మోపే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే… ప్రయాణ సమయం పెరగడంతో పాటుగా ప్రయాణ వ్యయాలు కూడా పెరిగితే… భారత ప్రయాణికులకు దెబ్బ మీద దెబ్బ పడినట్టేనని చెప్పక తప్పదు. అయితే ఈ వ్యవహారంపై ఇటీవలే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు… ఈ సమస్యను అధిగమించడం ఎలా అనే విషయంపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఇప్పటికిప్పుడు ప్రయాణికులపై భారం మోపే అవకాశాలు లేవని కూడా ఆయన తెలిపారు. అయితే ప్రైవేట్ విమానయాన సంస్థలు ఈ భారాన్ని ఎంతకాలం పాటు మోయగలవన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది. 

భారత పౌర విమానయాన రంగ గణాంకాల ప్రకారం.. ఉత్తర అమెరికా, బ్రిటన్, దుబాయి వంటి దేశాలకు భారత్ నుంచి వెళ్లే విమానాలు పాక్ గగన తలం మీదుగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించడం ద్వారా వారానికి దాదాపుగా రూ.77 కోట్ల మేర అదనపు ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన నెలకు ఈ అదనపు వ్యయం రూ.306 కోట్లకు చేరే ప్రమాదం లేకపోలేదు. ఇది కేవలం ఉత్తర భారతం నుంచి ఈ దేశాలకు బయలుదేరే విమానాల వరకు మాత్రమే. ఇక దక్షిణాది నుంచి బయలుదేరే విమానాల అదనపు వ్యయాలను కూడా కలుపుకుంటే… ఈ అదనపు వ్యయం తడిసిమోపెడు కానుందని చెప్పక తప్పదు. అదే సమయంలో విమాన ప్రయాణికులపై పడే అదనపు భారం కూడా భారీగానే ఉండే ప్రమాదం లేకపోలేదు. మరి ఈ అదనపు వ్యయాలను నిలువరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది.