ఇది చాలా సున్నితమైన అంశం

కులాల వారీగా దేశంలో జనాభాను గణించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఏళ్ల తరబడి పలు వర్గాల నుంచి ఈ డిమాండ్ వినిపిస్తున్నా… ఆ దిశగా ఇప్పటిదాకా అడుగు ముందుకు పడలేదు. అయితే తాజాగా బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కుల గణన దిశగా కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే ఏడాది చేపట్టనున్న జన గణన సమయంలోనే కుల గణనను కూడా చేపట్టాలని కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

కుల గణన రాజకీయంగా చాలా సున్నితమైన అంశమన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో రిజర్వేషన్లను అందుకుంటున్న ఆయా సామాజిక వర్గాలు తమ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ ప్రధానంగా బీసీ వర్గాల నుంచే వినిపిస్తోంది. దేశ జనాభాలో సగానికి పైగా తామే ఉన్నామని చెబుతున్న బీసీలు ఆ మేరకు తమకు తగినంత మేర రిజర్వేషన్లు మాత్రం దక్కడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కుల గణన చేపట్టి… అందులో వచ్చిన ఫలితాల ఆధారగా రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించాలని ఆ వర్గాలు డిమాడ్ చేస్తున్నాయి. 

ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కుల గణనను చేపట్టింది. ఈ కుల గణన ఆధారగా రిజర్వేషన్లను మారుస్తున్నట్లు కూడా రేవంత్ సర్కారు ప్రకటించింది. ఆ మేరకు తాను తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రానికి కూడా పంపింది. తాము తీసుకున్న నిర్ణయానికి అనుమతి ఇవ్వాలని కూడా కేంద్రాన్ని తెలంగాణ కోరింది. అంతేకాకుడా కేంద్రం కూడా దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కూడా మోదీ సర్కారును తెలంగాణ కోరింది. తెలంగాణ లోని తమ పార్టీ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కొనియాడింది.

తాము అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి సర్కారులో దీనిపై గత కొంతకాలంగా ఒకింత లోతుగానే చర్చ సాగింది. ఎట్టకేలకు కుల గణనకు అనుకూలంగా ఎన్డీఏ నిర్ణయం తీసుకోగా… ఆ నిర్ణయానికి బుధవారం నాటి కేంద్ర కేబినెట్ భేటీ ఆమోద ముద్ర వేసినట్టు అయ్యింది. కేంద్రం ప్రకటించినట్లుగా కుల గణన జరిగిన తర్వాత ఆయా వర్గాలకు అందుతున్న రిజర్వేషన్ల శాతాల్లోనూ మార్పులు చోటుచేసుకోవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.