సింహాచ‌లం సెగ‌: క‌లెక్ట‌ర్ ట్రాన్స్‌ఫ‌ర్‌.. చంద్ర‌బాబు డెడ్‌లైన్‌!

విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని ప్ర‌ముఖ దేవాల‌యం సింహాచ‌లంలో బుధ‌వారం తెల్ల‌వారు జామున ఓ గోడ కూలి భ‌క్తుల‌పై ప‌డిన ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తం గానే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం రేపింది. దీనిపై ప్ర‌ధాని నుంచి రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు ప్రగాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు. ఇక‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్ర సానుభూతి వ్య‌క్తం చేస్తూనే.. అధికారుల‌పై నిప్పులు చెరిగారు.

తాజాగా విశాఖ‌ప‌ట్నం ఉన్న‌తాధికారులతో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేల‌తోనూ ఆయ‌న వీడియో కాన్ఫ‌రె న్స్ నిర్వ‌హించారు. అస‌లు ఈ ఘ‌ట‌న ఎలా జ‌రిగింది? ఎవ‌రి నిర్ల‌క్ష్యం ఉంది? ముందుగా చేసిన ఏర్పాట్లు ఏంటి? గ‌త ఏడాది కంటే.. ఈ సారి ఎక్కువ మంది భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిసినా.. ఎందుకు నిర్ల‌క్ష్యంగా ఉన్నారంటూ.. నిప్పులు క‌క్కారు. ఈ క్ర‌మంలో క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పై మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏర్పాట్ల‌కు సంబంధించి ఎన్ని సార్లు సమీక్షించార‌ని ఆయ‌న‌ను ప్ర‌శ్నించారు.

అయితే.. తాను ఒకే ఒక్క‌సారి స‌మీక్షించాన‌ని.. విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తాను సింహాచలంపై ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌లేక‌పోయాన‌ని వివ‌రించారు. దీనిపైనా సీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అదేస‌మ‌యంలో జిల్లాకు చెందిన హోం మంత్రి అనిత‌పైనా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఏర్పాటు చేసే ముందు మీరు ప‌ర్య‌వేక్షించారా? అని ఆమెను కూడా నిల‌దీశారు. మొత్తంగా వీడియో కాన్ఫ‌రెన్స్ హాట్‌హాట్‌గా జ‌రిగింది.

అనంత‌రం.. విశాఖ‌ప‌ట్నం క‌లెక్ట‌ర్‌గా హ‌రేంధిర‌ ప్ర‌సాద్ ను బ‌దిలీ చేయాల‌ని.. త‌ర్వాత ప‌రిణామాల‌ను బ‌ట్టి.. వేరే పోస్టు ఇవ్వాల‌ని సీఎస్‌ను ఆదేశించారు. అదేవిధంగా సింహాచ‌లం ఘ‌ట‌న‌పై త‌న‌కు 72 గంట‌ల్లోగా నివేదిక‌ను అందించాల‌ని కూడా.. సీఎం చంద్ర‌బాబు అధికారులకు డెడ్‌లైన్ విధించారు. మంత్రులు కూడా.. విడిగా త‌న‌కు నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. కూలిపోయిన గోడ‌ను క‌ట్టించిన కాంట్రాక్ట‌ర్‌పైనా కేసులు పెట్టాల‌న్నారు.