తెలుగు నేల విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా నవ్యాంధ్రప్రదేశ్ నూతన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ తరహా పరిస్థితి శత్రు రాజ్యాలకు కూడా రాకూడదు. ఎందుకంటే… రాజధాని లేకుండా పాలన సాగించేదెలా? వ్యవస్థలను పకడ్బందీగా నిర్వహించేదెలా? రాజధాని లేని రాజ్యం తల లేని మొండెం మాదిరే కదా. ఇదే భావనతో సాగిన టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన తొలి పాలనలో ఏడాది వ్యవధిలోనే ఏపీకి నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. ఐధేళ్లు తిరక్కుండానే… దానికో రూపూ తీసుకువచ్చారు. అయితే జగన్ వచ్చి రాజధాని కలను చిధ్రం చేశారు. ఇలాంటి విధ్వంసాలు జరక్కూడదంటే…అమరావతికి గట్టి భద్రత కావాల్సిందే. అంటే.,. రాజధానిగా అమరావతికి చట్టబద్ధతను తీసుకురావాల్సిందే.
ఇదే మాట చంద్రబాబు నోటా సోమవారం వినిపించింది. మే 2న రాజదాని నిర్మాణ పనుల పున:ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు రాజధాని రైతులు, మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు రాజధానిగా అమరావతికి గట్టి భద్రత కావాల్సిందేనని, జగన్ లాంటి విధ్వంసకారులు అదికారంలోకి వచ్చినా… అమరావతికి ఎలాంటి నష్టం వాటిల్లని రీతిలో పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని బాబుకు తెలిపారు. జగనే కాదు… ఇంకెవరు వచ్చినా కూడా అమరావతికి కించిత్ కూడా నష్టం జరగరాదని కూడా వారు అభిలషించారు. రైతుల వాదన విన్న చంద్రబాబు తన మదిలోని మాటను బయటపెట్టారు.
వాస్తవానికి ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం నుంచి ఓ నోటిఫికేషన్ జారీ చేయించే దిశగా ఆలోచన చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం విభజన చట్టంలో ఎలాంటి అనుకూలతలు ఉన్నాయన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా కేంద్రం నోటిఫికేషన్ ద్వారా అమరావతికి చట్టబద్ధత దక్కేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్రం వద్ద ప్రతిపాదించామన్న బాబు… తాజాగా అమరావతికి వస్తున్న మోదీ వద్ద కూడా మరోమారు ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లుగా తెలిపారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పదేళ్ల పాటు కేంద్రం ప్రకటిస్తే.. ఆ గడువు కూడా ఇప్పటికే ముగిసిపోయిందని… ఈ నేపథ్యంలో ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు కేంద్రానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిని ఎక్కడికక్కడే నిలిపేశారు. రాజధానిగా అమరావతిని కనుమరుగు చేసే దిశగానూ ఆయన యత్నించారు. అమరావతి స్థానంలో విశాఖను అభివృద్ధి చేసే దిశగా కుట్రలూ చేశారు. అయితే రాజధాని రైతులు ఏళ్ల తరబడి నిరసనలు చేపట్టారు. కోర్టుల్లో న్యాయ పోరాటం చేశారు. అందుబాటులో ఉన్న అన్ని అంశాలనూ వినియోగించుకుని జగన్ దూకుడుకు కళ్లెం వేశారు. అలాంటి ప్రమాదమే మరోమారు ఉద్భవించకుండా ఉండాలంటే… చంద్రబాబు, రాజధాని రైతులు చెబుతున్నట్లుగా ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చేసి తీరాల్సిందేనన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. ఇది జరిగితేనే రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లబిస్తుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.