ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్లోని పహల్గామ్లో ఇటీ వల జరిగిన ఉగ్రవాద దాడిపై ఆయన స్పందించారు. తాజాగా జనసేన ఆధ్వర్యంలో నాటి ఉగ్ర దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. నివాళులర్పించారు. అనంతరం.. పార్టీ కార్యాలయంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
అనంతరం.. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కశ్మీర్ ఎప్పటికీ భారత్దేనని ఉద్ఘాటించారు. మూడు సార్లు పాకిస్థాన్ను ఓడించిన విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పాకిస్థాన్ పై ప్రేమ ఉన్న వాళ్లు ఆ దేశానికే వెళ్లిపోవాలని అన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహించడంతో పాటు.. ఉగ్రదాడులకు ప్రేరేపిస్తున్న పాకిస్థాన్.. కారణంగా కశ్మీర్లోని పండిట్లు వందల సంఖ్యలో మృతి చెందారని.. అనేక మంది పొట్ట చేత పట్టుకుని వలస పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
పహల్గామ్లో పర్యాటకులను పరుగులు పెట్టించి మరీ .. దారుణంగా కాల్చి చంపారని, మతం ఏంటి? అని అడిగిమరీ దారుణానికి ఒడిగట్టారని, ఇలాంటి వారిపై జాలి చూపించాల్సిన అవసరం లేదని.. పవన్ కల్యాణ్ అన్నారు. అయినా.. భారత్ సంయమనంతోనే ఉందని.. ఈ సంయమనమే.. ఇప్పుడు మరింత ఎక్కువైందా? అనే సందేహం కలుగుతోందన్నారు. భారత్లో ఉండి.. ఇక్కడి తిండి తిని.. పాకిస్థాన్కు అనుకూలంగా కొందరు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.
ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్నీ ఏకం చేసిందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పుడు ఉన్న భారత దేశం డిఫరెంట్ అని.. దేశం యావత్తు ఏకతాటిపైకి వచ్చిందని చెప్పారు. ప్రధాని మోడీని విమర్శించే వారు కూడా.. ఇప్పుడు మద్దతు గా నిలుస్తున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లా వాసి, ఉగ్రదాడుల్లో మృతి చెందిన మధుసూదన్రావు కుటుంబానికి జనసేన తరఫున రూ.50 లక్షలు సాయం అందిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు.