జగన్ తన్నితే.. బాబు అక్కున చేర్చుకుంటున్నారు

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులను వ‌చ్చే నెల 2న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పునః ప్రారంభించ‌నున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా అమ‌రావ‌తి రైతుల‌తో సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో ఉన్న కాన్ఫ‌రెన్స్ హాల్లో ప్ర‌త్యేకంగా భేటీ అయిన ఆయ‌న‌.. వారిని అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌కు ఆహ్వానించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు కాబోతుందని తెలిపారు. రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలక అడుగు అవుతుందని సిఎం అన్నారు.

రాజధాని రైతుల త్యాగం కారణంగానే నేడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నామని చెప్పిన చంద్ర‌బాబు.. ఎప్పటికీ రైతుల మంచి మనసును రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు. రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమం, పనుల్లో భాగస్వామ్యం కావాలని రైతులను మ‌న‌స్పూర్తిగా సీఎం ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని నిర్మాణంలో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లు, భూములు ఇచ్చిన‌ రైతుల సాధకబాధలపై చ‌ర్చించారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి కేటాయించే ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణం పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

‘2014లో రాజధాని ప్రకటన తర్వాత రైతులు భూములివ్వకుండా ఉండేందుకు వైసీపీ నేతలు అపోహలు సృష్టించి రెచ్చగొట్టారు. అయినా మాపై నమ్మకంతో రైతులు ముందుకొచ్చి 34 వేల ఎకరాలు ఇచ్చారు. రాజధానికి భూములిచ్చిన రైతులు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని కొనసాగిస్తామని చెప్పి తర్వాత మూడు రాజధానులు, స్మశానం, ఎడారి అన్నారు. ఐదేళ్ల మీ పోరాటం కారణంగానే అమరావతిని ఏమీ చేయలేకపోయారు.“ అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. మే 2న రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభానికి ప్రధాని మోడీ వస్తున్నార‌ని, ప్రతిగ్రామం, ప్రతి ఇంటి నుంచి ఈ సభకు ప్రజలు తరలిరావాలని ఆయ‌న కోరారు.

ఈ సంద‌ర్భంగా అదనపు భూసేకరణపై సీఎం చంద్ర‌బాబు చ‌ర్చించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణాలకు మరికొంత భూమి అవసరం అవుతుందని తెలిపారు. వీటి అవసరాలకు అనుగుణంగా భూమిని తీసుకోవాల్సి ఉంటుందని, రాజధాని కోసం స్వచ్చందంగా భూములు ఇచ్చిన రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా, వారికి నష్టం జరిగేలా ఏ కార్యక్రమం, నిర్ణయం ఉండదని సిఎం అన్నారు. కృష్ణానదిపై మరో మూడు, నాలుగు వారధులు కూడా వస్తాయని తెలిపారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు నిర్మిస్తామ‌న్నారు. రాజధాని ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల త్యాగాలకు గుర్తుగా స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని రైతులు కోరగా.. శాతవాహన కాలం నుంచి అమరావతి ఉద్యమం వరకు జరిగిన పరిణామాలన్నీ క్రోడీకరిస్తూ మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.