సిద్ధరామయ్య గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేత. అంతేనా… కర్ణాటకకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేత. ఇప్పుడే కాదు… గతంలోనూ ఆయన కర్ణాటకకు సీఎంగా వ్యవహరించారు. అదేంటో గానీ… ఎప్పుడు సీఎంగా ఉన్నా కూడా సిద్ధరామయ్య వివాదాలను కొని తెచ్చుకుంటారు. తనకు నచ్చని పని జరిగిందంటే… తానెక్కడున్నాను?.. ఆ సందర్భం ఏమిటి?.. తన ఎదురుగా ఉన్నది ఎవరు? అన్న విషయాలను ఆయన ఏమాత్రం పట్టించుకోరనే చెప్పాలి. కోపం వచ్చిందంటే… ఆయన చేయి దానికదే పైకి లేస్తుంది. ఎదురుగా ఉన్న వారి చెంప చెళ్లుమనిపిస్తుంది. ఇదివరకే ఓ సారి పార్టీ కార్యకర్త మీద, మరోమారు ప్రభుత్వ అధికారి మీద ఆయన తన ప్రతాపాన్ని చూపారు.
తాజాగా సోమవారం అలాంటి ఘటనే మరొకటి జరిగింది. బెళగావిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో బీజేపీ శ్రేణులు నల్ల జెండాలు చూపాయన్న ఆగ్రహంతో ఊగిపోయిన సిద్ధరామయ్య… దానికి ఓ ఎస్పీని బాధ్యుడిని చేస్తూ… సదరు ఐపీఎస్ అధికారిని తన దగ్గరకు పిలిచి మరీ చెంప చెళ్లుమనిపించే యత్నం చేశారు. అయితే ఎస్పీ ఎంతైనా ఓ పోలీసు అధికారి కదా… సీఎం చేయి తన చెంపను చెళ్లుమనిపించేలోగానే ఆయన తన ముఖాన్ని కాస్తంత వెనక్కు జరిపారు. దీంతో సిద్ధరామయ్య చేయి అయితే ఆ అధికారికి తగలలేదు గానీ… ఈ వీడియో మాత్రం క్షణాల్లో వైరల్ అయిసోయింది. దేశవ్యాప్తంగా పలువురు నేతలు సిద్ధరామయ్య తీరుపై మండిపడుతున్నారు.
సిద్ధరామయ్య చర్యను ఖండిస్తూ బీజేపీకి చెందిన చాలా మంది నేతలు ఆయన నుంచి క్షమాపణను డిమాండ్ చేశారు. అంతేకాకుండా “ఓ ప్రజా ప్రతినిధిగా మీ అదికారం కేవలం ఐదేళ్లే. అదే సదరు పోలీసు అదికారి 60 ఏళ్ల వయసు దాకా సర్వీసులో కొనసాగుతారు. ఆ మాత్రం విషయం కూడా తెలియదా? తక్షణమే ఎస్పీకి, పోలీసులకు క్షమాపణ చెప్పండి” బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సిద్ధరామయ్య చర్యను సమర్థించకున్నా… ఆయనను వెనకేసుకువచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్… బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో బీజేపీ నేతలకు ఏం పని అని ప్రశ్నించారు. ఈ మొత్తం ఘటనకు బీజేపీ శ్రేణుల అత్యుత్సాహమే కారణమని ఆయన ఆరోపించారు. మొత్తంగా సిద్ధరామయ్య వ్యవహారం మరోమారు జాతీయ స్థాయిలో రచ్చ రచ్చగా మారిపోయింది.