ఆ లేడీ ఎమ్మెల్యే వైసీపీని వ‌దిలేస్తారా

దాస‌రి సుధ‌. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం బ‌ద్వేల్ నుంచి రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. 2022-23 మ‌ధ్య వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో(ఆమె భ‌ర్త మ‌ర‌ణంతో) ఒక‌సారి, 2024లో వ‌చ్చిన ఎన్ని క‌లో రెండోసారి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈమె.. సౌమ్యురాలిగా పేరు తెచ్చుకున్నారు. అదే స‌మ‌యంలో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి కూట‌మిలో ఉన్నార‌న్న పేరు కూడా ఉంది. అవినాష్‌రెడ్డి ఎంత చెబితే అంత అన్న‌ట్టుగా ఆమె రాజకీయాలు చేశారు.

కానీ, ఇది ఎన్నిక‌ల వ‌ర‌కు విజ‌యం ద‌క్కించి పెట్టినా.. మారిన ప‌రిస్థితులు.. వైసీపీలోని బ‌ద్వేల్ నేత‌ల వ‌ర్గ రాజ‌కీయాల్లో ఎమ్మెల్యే ఒంట‌రి అయ్యారు. బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో అవినాష్‌రెడ్డిని వ్య‌తిరేకిస్తున్న వ‌ర్గం దూకుడు పెంచింది. దీనికి తోడు.. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించిన మ‌రో వ‌ర్గం నాయ‌కుడు కూడా.. దాస‌రి సుధ‌పై సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక ప్ర‌చారం ముమ్మ‌రం చేస్తున్నారు. ఆమె వ‌ల్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఏమీ జ‌ర‌గ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌, వ్య‌క్తిగ‌తంగా చూసుకున్నా.. సుధ ప‌నితీరు ఏమాత్రం బాగోలేద‌న్న చ‌ర్చ ఉండ‌నే ఉంది. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. కూడా ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ప‌నులు చేయ‌లేద‌ని అంటారు. ఇప్పుడు ప్ర‌భుత్వ ప‌క్షంలో లేక‌పోవ‌డం.. వ్య‌తిరేక వ‌ర్గాలు రెండూ కూడా.. ఆమెను దూరం పెట్ట‌డంతో ఎటూ పాలు పోని ప‌రిస్థితి నెల‌కొంది. కొన్ని రోజుల కింద‌ట త‌న గోడు చెప్పుకొనేందుకు తాడేప‌ల్లికి రాగా.. రెండు రోజులు వెయిట్ చేయించారు.

దీంతో మ‌న‌స్థాపానికి గురైన సుధ‌.. జ‌గ‌న్‌ను కానీ.. తాడేప‌ల్లి పెద్ద‌ల‌ను కానీ.. క‌ల‌వ‌కుండానే ఇంటికి వెళ్లిపో యారు. ఈ ప‌రిణామాల‌తో ఆమె చూపు మారుతోంద‌ని కొన్ని రోజులుగా చెబుతున్నారు. జ‌న‌సేన నుంచి ఆమెకు ఆహ్వానాలు అంద‌డం.. కుటుంబ ప‌రంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఉండ‌డం వంటివి ఆమెను మార్పు దిశ‌గా అడుగులు వేయిస్తున్నాయ‌ని తెలుస్తోంది. సో.. ఆమె వైసీపీకి దూరం కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి రాజ‌కీయాల‌న్నాక ఏమైనా జ‌ర‌గొచ్చుక‌దా! సుధ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోచూడాలి.