అన్న క్యాంటీన్ల‌కు వైసీపీ స‌ర్టిఫికెట్‌.. నిజం..!

ఏదైనా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంలో ఒక‌సారి చేప‌డితే.. బాగానే ఉంటుంది. ఒక రోజు లేదా.. ఒక వారం కొన‌సాగిస్తే .. బాగానే ఉంటుంది. కానీ, ఒకే కార్య‌క్ర‌మాన్ని నిరంత‌రం చేప‌ట్టినా.. ప్ర‌తి రోజూ కొన‌సాగించినా.. అందులో స‌హ‌జంగానే నాణ్య‌త లోపిస్తుంది. ప‌నిచేసేవారు కూడా.. ముభావంగానే.. ఉంటారు. టెక్నిక‌ల్‌గా మారిపోతా రు. ఇది స‌హ‌జంగా ప్ర‌భుత్వాలు చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌పై ఉన్న ప్ర‌జా భిప్రాయం. కానీ, కూట‌మి స‌ర్కారు పునః ప్రారంభించిన అన్న క్యాంటీన్ల విష‌యంలో మాత్రం దీనికి భిన్నంగా జ‌రుగుతోంది.

అన్న క్యాంటీన్ల‌ను ప్రారంభించిన 10 మాసాల త‌ర్వాత‌… కూడా అదే నాణ్య‌త‌, అదే ప‌రిశుభ్ర‌త‌, అదే అంకిత భావంతో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందుతున్నాయి. 2014లో టీడీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. 2017-18 మ‌ధ్య రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. రూ.5కే ఉద‌యం టిఫిన్‌, రూ.5కే మ‌ధ్యాహ్న భోజ‌నం, రూ.5కే రాత్రి భోజ‌నం అందిస్తున్నారు. ఇవి నాణ్యంగా.. రుచిగా.. శుచిశుభ్ర‌త‌ల‌తో ఉంటున్నాయి. అయితే.. వైసీపీ హ‌యాంలో వీటిపై క‌త్తిక‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రించి.. క్యాంటీన్ల‌ను మూసేశారు.

ఇక‌, టీడీపీ కూట‌మిక‌ట్టి.. తిరిగి అధికారంలోకి వ‌చ్చిన గ‌త ఏడాదినుంచి అన్న క్యాంటీన్ల‌ను పునఃప్రారం భించింది. ప్ర‌స్తుతం 10వ నెల‌లోకి చేరుకున్న అన్న క్యాంటీన్ల‌లో తొలిరోజు ఎలాంటి వాతావ‌ర‌ణం ఉందో ఇప్పుడు కూడా అదే కొన‌సాగుతోంది. ఈ విష‌యాన్ని టీడీపీ నాయ‌కులు, మంత్రులు కాదు.. వైసీపీకి చెందిన ప‌లువురు నాయ‌కుల‌తో పాటు.. ప‌లు జిల్లాల క‌లెక్ట‌ర్లు చెబుతున్న మాట‌. తాజాగా విజ‌య‌వాడ‌లో వైసీపీ నాయ‌కుడు ఒక‌రు(మాజీ ఎమ్మెల్యే కూడా) ప‌నిపై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప‌నిలో ప‌నిగా ఆయ‌న క్యాంటీన్‌కు వెళ్లి అక్క‌డి ప‌రిస్థితి చూసి విమ‌ర్శించాల‌ని అనుకున్నారు.

కానీ, అక్క‌డివాతావ‌ర‌ణం.. ప‌ద్ద‌తి చూసిన త‌ర్వాత‌.. విమ‌ర్శించ‌క పోగా.. తాను కూడా స్వ‌యంగా రూ.5 చెల్లించి.. క్యూలో నిల‌బ‌డి టిఫిన్ చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే.. తాను ఎమ్మెల్యే అన్న విష‌యాన్ని ఆయ‌న ఎవ‌రికీ చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ కూడా ఓ అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. లైనులో నిలబడి రూ.5 చెల్లించి టోకెన్‌ కొని, అల్పాహారాన్ని రుచి చూశారు. ఆహార పట్టిక, టోకెన్‌ కౌంటర్‌, ఆహార పదార్థాలను వడ్డిస్తున్న శైలి, డైనింగ్‌ ఏరియాతోపాటు మంచినీరు, చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశాలను పరిశీలించారు.

నాణ్యత, క్యాంటీన్‌లో పరిశుభ్రతపై అక్కడ ఆహారం తీసుకుంటున్న వారిని అడిగి తెలుసుకున్నారు. అంతా బాగుంద‌ని స‌ర్టిఫికెట్ ఇచ్చారు. సో.. ఇదీ సంగ‌తి! చేసే ప‌నిలో నిబ‌ద్ధ‌త‌.. అంకిత భావం ఉంటేనే ఇవి సాధ్య‌మ‌వుతాయ‌ని.. చెప్ప‌డం గ‌మ‌నార్హం. వైసీపీ నాయ‌కులు .. త‌ర‌చుగా అన్నా క్యాంటీన్ల‌ను వెళ్తున్న విష‌యం అప్పుడ‌ప్పుడు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.