రాజు గారి పై గంటా ఫైరింగ్… విషయమేంటి?

ఏపీలో అధికార కూటమిలోని రెండు పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం రాజుకుంది. ఈ క్రమంలో ఇద్దరు నేతలు నడిరోడ్డుపై వాదులాడుకున్నారు. ఒకరు మరొకరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే… ఆ మరొకరు ఫైర్ అవుతున్న నేతకు సర్ది చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖ జిల్లా పరిధిలోని భీమిలి ఎమ్మెల్యేగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొనసాగుతుండగా… విశాఖ నగర పరిధిలోని విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నేత పెన్మత్స విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శనివారం వీరిద్దరి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాజు గారి తీరుపై గంటా ఓ రేంజిలో ఫైరయ్యారు. అది కాదండి… ఇది కాదండి అంటూ రాజు గారు ఆయనకు ఎంతగా సర్దిచెప్పినా… గంటా ఏమాత్రం చల్లబడకపోవడం గమనార్హం.

గంటా వర్సెస్ రాజు గారి మధ్య వివాదానికి కారణమేమిటన్న విషయానికి వస్తే.. విశాఖ ఫిల్మ్ నగర్ క్లబ్ గంటా నియోజకవర్గమైన భీమిలి పరిధిలోకి వస్తుంది. అయితే ఈ క్లబ్ లీజు విషయానికి సంబంధించి రాజు కలెక్టర్ కు ఓ వినతి పత్రాన్ని సమర్పించారట. ఈ వినతి పత్రంపై రాజుతో పాటు కూటమికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారట. వీరిలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు కూడా సంతకం చేశారట. వాస్తవానికి గంటా నియోజకవర్గ పరిధిలోని ఈ క్లబ్ కు సంబంధించిన విషయం కాబట్టి… విషయం ఏదైనా గంటాకు విషయం తెలియజేయాల్సి ఉంది. అయితే రాజు మాత్రం ఆ విషయాన్ని ఎలా మరిచిపోయారో గానీ… గంటాకు తెలియకుండానే ఈ వినతి పత్రాన్ని కలెక్టర్ కు సమర్పించారు. కలెక్టరేట్ సిబ్బంది ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న గంటా… ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు.

ఈ క్రమంలో శనివారం తనకు తారసపడ్డ రాజును గంటా నిలదీశారు. ఇదేం పద్దతి అంటూ ఆయనను ప్రశ్నించారు. ఇదేదో చేయి దాటిపోయేలా ఉందని భావించిన రాజు… తాను మాత్రం ఆగ్రహానికి గురి కాకుండానే… జరిగిన విషయాన్ని గంటాకు తెలియజెప్పేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఓ వైపున మీరు చేసింది ముమ్మాటికీ తప్పేనని గంటా విరుచుకుపడుతూ ఉన్నా.. సహనంతో సాగిన రాజు… ”అదేదో అలా జరిగిపోయింది.. పొరపాటు అయ్యింది. సంతకాలు చేసిన వారి తప్పేమీ లేదు.. ఎంపీ గారికి తెలియజేసిన తర్వాతే ఈ దిశగా అడుగేశాను… ఇంత పెద్ద ఇష్యూ అవుతుందనుకోలేదు”..అంటూ సమాధానం ఇచ్చేందుకు యత్నించారు. అయినా కూడా గంటా ఏమాత్రం తగ్గలేదు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనకే తెలియకుండా తన నియోజకవర్గ సమస్యలపై మీరెలా వినతి పత్రం ఇస్తారంటూ ఫైరయ్యారు. మీ వరకు మీరు ఇచ్చి ఉంటే సరే అనుకుంటే… అలా కాకుండా మరింత మంది ఎమ్మెల్యేలతో సంతకాలు ఎలా చేయిస్తారని మండిపడ్డారు.

వివాదం పెరుగుతుందని భావించిన రాజు… గంటాను ఆయన కారులోకి ఎక్కించి కూర్చోబెట్టి మరీ సర్ది చెప్పే యత్నం చేశారు. అయినా కూడా గంటా తన ఆగ్రహాన్ని కట్టడి చేసుకోలేకపోయారు. ”మీరేమో ఏదో అలా జరిగిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో చూడండి ఎలా ప్రచారం చేస్తున్నారో. విష్ణు కుమార్ రాజు దెబ్బ అంటే ఇలాగే ఉంటుంది అంటూ రాస్తున్నారు” అని గంటా ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా వార్తలను పట్టించుకుంటే ఎలా అంటూ రాజు చెప్పే ప్రయత్నం చేసినా…ఇంకేం చేయమంటారు అంటూ గంటా మరింత ఆగ్రహానికి గురయ్యారు. ”నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోకి అడుగుపెట్టడమే తప్పంటే… తిరిగి దానిని ఎలాగోలా సర్దుబాటు చేసుకోవాలని ఎలా చెబుతారు? ఎంపీ అయితే ఏమిటి? కలెక్టర్ అయితే ఏమిటి?” అంటూ గంటా ఫైర్ అయ్యారు. ఇలా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను ఓ వైపు మీడియా ప్రతినిధులు చిత్రీకరిస్తున్నా… అటు గంటా గానీ, ఇటు రాజు గానీ పట్టించుకోకుండా సాగడం గమనార్హం.