స‌స్పెండ్ చేసినా.. చింత లేదా…

ఒక నాయ‌కుడిని స‌స్పెండ్ చేస్తే.. చింత ఉండాలి. మార్పు రావాలి. క‌నీసం.. ఆవేద‌న అయినా ఉండాలి. కానీ.. వైసీపీ నుంచి స‌స్పెండ్ అవుతున్న నాయ‌కుల‌కు ఈ త‌ర‌హా చింత లేక‌పోవ‌డం.. గ‌మ‌నార్హం. తాజాగా దువ్వాడ శ్రీనివాస్‌ను స‌స్పెండ్ చేశారు. అయితే.. ఆయ‌న‌లో చిన్న‌పాటి ఆవేద‌న కూడా లేక‌పోగా.. పై పెచ్చు.. ఇండిపెండెంటుగా ఉంటేనే బాగుంద‌న్న కామెంట్లు చేయ‌డం మ‌రింత‌గా ఆయ‌న శైలిని.. ఇగోను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోంది.

నిజానికి.. రాజ‌కీయాల్లో ఉన్న‌వారు త‌మ ప‌రిధులు తాము తెలుసుకుని ముందుకు సాగాలి. పార్టీకి ప్ర‌యోజన‌క‌రంగా అయినా.. ఉండాలి. ఏదైనా తేడా వ‌చ్చిన‌ప్పుడు త‌మ‌ను తాము స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం అయినా చేయాలి. ఇవేవీ లేకుండానే ఎదురు దాడి చేయ‌డం.. తామంతటి వారు లేర‌న్న వాద‌న‌ను వినిపించడం వంటివి ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. రాజ‌కీయాల్లో విధేయ‌త అన్న‌ది లేక‌పోతే.. చాలా క‌ష్ట‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

టీడీపీలో కూడా.. చాలా మందిని స‌స్పెండ్ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. కానీ.. వారు త‌మ‌ను తాము తెలుసుకుని ముందుకు సాగారు. పార్టీ ప‌ట్ల‌, పార్టీ అధినేత ప‌ట్ల విన‌య విధేయ‌త‌లు ప్ర‌ద‌ర్శించారు. తద్వారా పార్టీలో ప‌ద‌వులు పొందిన వారు ఉన్నారు. ఇవ‌న్నీ.. కూడా..నాయ‌కులు చూపించే విధేయ‌త‌, వినయం సంస్కారం వంటి వాటిపై ఆధార‌ప‌డి ఉంటాయి. కానీ.. ఈ త‌ర‌హా సంస్కృతి, సంప్ర‌దాయాలు.. వైసీపీలో కనిపించ‌డ‌మే లేదు.

అధికారంలో ఉంటే దోచుకోవ‌డం.. దాచుకోవ‌డ‌మే ప‌రమావ‌ధిగా మారిన ప‌రిస్థితి నుంచి మార్పు దిశ‌గా నాయకులు అడుగులు వేయాల్సిన ప‌రిస్థితి రావాల్సి ఉంద‌ని అనేక స‌ర్వేలు చెబుతున్నాయి. కానీ.. వైసీపీ నాయ‌కుల్లో ఈ త‌ర‌హా మార్పు క‌నిపించ‌డం లేదు. పార్టీని న‌డిపించ‌డం.. బ‌లోపేతం చేయ‌డం.. వంటి వాటిపై వ్య‌క్తిగ‌తంగా దృష్టి పెట్టే నాయ‌కులు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిస్థితి మారితే త‌ప్ప‌. వైసీపీకి మంచి రోజులు వ‌చ్చే పరిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.