విజయవాడ ప్రస్తుత ఎంపీ.. కేశినేని చిన్ని(శివనాథ్), మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) ఇద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములు. రాజకీయంగా వైరం లేకపోయినా.. ఆస్తులు.. అప్పుల వివాదాలు, వ్యాపారాల ఘర్షణ ల నేపథ్యంలో ఇరువురూ విభేదించుకుంటున్న విషయం తెలిసిందే. గత ఎన్నికలకు ముందు నుంచి ఇది.. రాజకీయ యుద్ధంగా మారింది. అన్నకు వ్యతిరేకంగా తమ్ముడు.. తమ్ముడికి వ్యతిరేకంగాఅన్న రాజకీయాలు చేసుకుంటూ… పొలిటికల్ సమరంలో దూకుడుగా ఉన్నారు.
ఈ క్రమంలోనే 2024 పార్లమెంటు ఎన్నికల్లో కేశినేని చిన్నికి చంద్రబాబు ఎంపీ సీటును ఇచ్చారు. ఇక, దీనిని ముందుగానే ఊహించిన నాని.. టీడీపీపై నిందలు మోపి.. చంద్రబాబు, నారా లోకేష్లను.. తీవ్రంగా తిట్టిపోసి.. బయటకు వచ్చారు. ఆ వెంటనే వైసీపీ పంచన చేరారు. ఆ పార్టీ టికెట్పై పోటీ చేసి.. విజయవాడ ఎంపీగా ఆయన ఓడిపోయారు. ఇక, ఆ తర్వాత కూడా.. కొన్నాళ్లు అన్నదమ్ముల మధ్య రాజకీయ వ్యాఖ్యలు .. వివాదాలు.. వ్యక్తిగత విమర్శలు వచ్చాయి.
తాజాగా కేశినేని నాని.. తమ్ముడు చిన్నిపై మరింత తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. విజయవాడలో ఎంపీ చిన్ని తన కార్యాలయానికి ఎన్టీఆర్ భవన్ అని పేరు పెట్టుకున్నారు. అయితే.. దీనిని తప్పుబడుతూ.. నాని తాజాగా సుదీర్ఘ పోస్టు పెట్టారు.
“విజయవాడ ప్రజలు తనను ఘనంగా గెలిపించుకున్నారని చెప్పుకొనే వ్యక్తి కార్యాలయానికి ఉన్న పేరు ఎన్టీఆర్ భవన్. కానీ. ఇక్కడ కూర్చుని ఆయన(ఎంపీ చిన్ని) చేసేది.. ఇసుక దందాలు, ఫ్లైయాష్ తోలకాలు, గ్రావెల్ అక్రమాలు. భూ దందాలు బ్రోకరేజీలు. వాస్తవానికి ఎన్టీఆర్ అంటే.. పేదల పెన్నిధి. తెలుగు వారి ఆత్మ గౌరవం. అలాంటి నాయకుడి పేరును దందాలు చేసే కార్యాలయానికి పెట్టాడు. కానీ.. ఈ కార్యాలయానికి “ఛార్లెస్ శోభరాజ్ భవన్” అని పేరు పెట్టాలని విజయవాడ ప్రజలు కోరుతున్నారు” అని మాజీ ఎంపీ నానీ విరుచుకుపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates