అవును తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కేంద్రంలో తనకున్న పలుకుబడేమిటో తేలిపోయే సమయం వచ్చింది. చాలా కాలంగా కేంద్రప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి మంచి సంబంధాలనే మెయిన్ టైన్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే మంచి సంబంధాలను నెరిపిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు దూరమవుతారు ? కాబట్టి కేంద్రంతో దగ్గరగా ఉంటూనే బీజేపీ తో మాత్రం సమాన దూరం పాటిస్తున్నారు. అయితే పోలవరం నిధుల దగ్గర హఠాత్తగా సమస్య వచ్చిపడింది. ఇపుడొచ్చిన సమస్య మామూలుది కాదు. ప్రాజెక్టు భవిష్యత్తునే మార్చేసేంత పెద్ద సమస్య. అందుకనే ఇపుడందరు జగన్ ఏమి చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల పేరుతో కేంద్ర జలశక్తికి జగన్ రూ. 47 వేల కోట్లతో పంపించిన ప్రతిపాదనలు ఆమోదంపొందాయి. అయితే ఇంతలో ఢిల్లీలో ఏమయ్యిందో ఏమో 2014లో సవరించిన అంచనాలు రూ. 20 వేల కోట్లకే ఆర్ధికశాఖ ఆమోదం పొందినట్లు కబురు వచ్చింది. అంటే రాష్ట్రం పంపిన ప్రతిపాదనల్లో సగానికి సగం నిధుల్లో ఆర్ధికశాఖ కోత పెట్టేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు, జగన్ హయాంలో అందిన ప్రతిపాదనలను కేంద్ర జలశక్తి ఆమోదించింది. తాజాగా జగన్ పంపిన అంచనాల మొత్తంలో ఆర్ధికశాక కోతపెట్టేసింది.
నిజానికి అంచనాలైనా లేకపోతే సవరించిన అంచనాల ఆమోదంలో కీలకపాత్ర పోషించాల్సింది ఆర్ధిక శాఖ మాత్రమే. ఎందుకంటే డబ్బులివ్వాల్సింది ఆర్ధికశాఖే. సరే ఇపుడు పోలవరం విషయంలో ఆర్ధికశాఖ చెప్పాల్సింది చెప్పేసింది. మరిక జరగాల్సిందేమిటి ? ఏమిటంటే జగన్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలవాలి. ప్రాజెక్టు వాస్తవ పరిస్ధితిని, పూర్తి చేయటానికి తమ ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ గురించి వివరించాలి. ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంత అవసరమో తెలియచేయాలి. నిధుల్లో కోత పెట్టడం వల్ల ప్రాజెక్టుతో పాటు రాష్రంలో ఎంతలా నష్టపోతుందో అర్ధమయ్యేట్లు చెప్పాలి. ప్రధాని గనుక కన్వీన్సయితే ఆర్ధికశాఖ ప్రాజెక్టు పూర్తి చేయటానికి అవసరమైన నిధులిస్తుంది. ఈ మొత్తంలో కేంద్రంలో తనకు ఎంత పట్టుందనే విషయాన్ని జగన్ ఇపుడు నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది.
మోడిపై అవసరమైన ఒత్తిడిని తేవటానికి, కన్వీన్స్ చేసి అవసరమైన నిధులు విడుదల చేసేలా ఒప్పించటానికి జగన్ తనకున్న పరిచయాలు, పలుకుబడి మొత్తాన్ని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. మోడితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బాగా దగ్గర వాడైన తమ పార్టీ సభ్యుడు పరిమళ్ నత్వానీ లాంటి వాళ్ళ సాయం తీసుకోవాలి. కేంద్రం నుండి అవసరమైన నిధులను సాధించుకునేందుకు పై ఇద్దరిపై ఒత్తిడి తేవటం కోసం నత్వానీ లాంటివాళ్ళను ప్రయోగించాల్సిన సమయం జగన్ కు ఆసన్నమైంది.
అప్పట్లో అంటే నత్వానికి రాజ్యసభ అవకాశం ఇఛ్చినపుడు సదరు ఎంపికి మోడి, అమిత్ షా ఇద్దరికీ అత్యంత సన్నిహితుడని కదా ప్రచారం జరిగింది. నత్వానికి రాజ్యసభ ఎంపి పదవిని జగన్ ఇచ్చింది కూడా ఈ కారణంతోనే. నేరుగా కేంద్రమే నిధులు సర్దుబాటు చేస్తుందా లేకపోతే ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఇంకెక్కడి నుండైనా ఇప్పిస్తుందా అన్నది కేంద్రం సమస్య. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం నత్వానీ లాంటివాళ్ళ రంగంలోకి దిగాల్సిన అవసరం వచ్చింది. ఇపుడు తనకున్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటేనే జగన్ గొప్పోడంటారు. లేకపోతే…..
Gulte Telugu Telugu Political and Movie News Updates