ఏపీలో నిరుద్యోగులు… ప్రత్యేకించి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు నెలల తరబడి చూస్తున్న ఎదురు చూపులకు ఎట్టకేలకు తెర పడింది. ఏపీకి రెండో సారి సీఎం కాగానే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ప్రకటనకు సంబంధించిన సంతకమే చేశారు. తాజాగా సరిగ్గా చంద్రబాబు బర్త్ డే నాడు ఈ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ కీలక ప్రకటన చేశారు. రేపు ఉదయం.. అంటే ఏప్రిల్ 20 ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీీ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు ఆ ప్రకటనలో లోకేశ్ పేర్కొన్నారు. రేపు చంద్రబాబు బర్త్ డే అన్న సంగతి తెలిసిందే కదా. సరిగ్గా చంద్రబాబు బర్త్ డే నాడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం కావడం గమనార్హం.
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే… మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని, సీఎంగా చంద్రబాబు తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మీదే పెడతారని ప్రకటించాయి. అనుకుున్నట్లుగానే ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించగా.. మెగా డీఎస్సీ కింద 16,347 ఉపాధ్యాయ పోస్టుల ను భర్తీ చేసే దిశగా చంద్రబాబు ఫైల్ పై తన తొలి సంతకాన్ని చేశారు. ఈ పరిణామం నిరుద్యోగులను నిజంగానే ఆనందాతిశయంలో ముంచేసిందని చెప్పాలి. అయితే వివిధ కారణాలతో చంద్రబాబు సంతకం చేసిన తర్వాత ఇట్టే 10 నెలల సమయం గడిచిపోయింది. అయితే ఈ 10 నెలల కాలాన్ని ఏమాత్రం వృథా చేయని అభ్యర్థలు కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకున్నారు. డీఎస్సీకి సన్నద్ధం అయ్యారు.
ఈ సందర్భంగా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు చాలా సమయమే పట్టిందని ఆయన అబిప్రాయపడ్డారు. అయితే తమ ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన నిరుద్యోగులు సహనంతో 10 నెలల కాలం పాటు వేచి చూశారన్నారు. 10 నెలల పాటు ఓపిక పట్టిన నిరుద్యోగులు వాస్తవ పరిస్థితులేమిటన్న దానిపై అవగాహనతో ముందుకు సాగారన్నారు. అయితే వారి ఓపికకు ఇక చెక్ పెట్టేస్తున్నామని చెప్పిన లోకేశ్… ఏప్రిల్ 20న ఇదివరకే ప్రకటించిన మేరకు 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీీ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే పరీక్షకు సర్వదా సిద్దం అయిన అభ్యర్థులు పరీక్షను మంచిగా రాసి ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగుల భవిష్యత్తుకు భరోసాగా నిలిచామని కూడా లోకేశ్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. గతంలో ఎన్నడూ లేనట్టుగా చంద్రబాబు తన 75వ జన్మదినాన్ని తన కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశాంతంగా జరుపుకునేందుకు ఇప్పటికే విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. బాబుతో పాటుగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ లు కూడా ఫారిన్ టూర్ వెళ్లారు. అలా విదేశాల్లో ప్యామిలీ మధ్య చంద్రబాబు తన జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటే… ఇక్కడ చంద్రబాబు జన్మదినం కానుకా అన్నట్లుగా మెగా డీఎస్పీ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం చేశారు. మొత్తంగా డైమండ్ జూబ్లీ బర్త్ డేను చంద్రబాబు జరుపుకుంటూ ఉండగా… అదే రోజున ఏపీోని కూటమి సర్కారు నిరుద్యోగులకు బంపరాఫర్ ఇస్తున్నట్లుగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుండటం గమనార్హం.