ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు అమరావతికి హైప్ వచ్చింది. అలా ఇలా కాదు.. ఒకవైపు ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తామని వెంటబడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కాదని.. ఇవ్వలేమని చెప్పిన ఎస్బీఐ, యూనియన్ బ్యాంకులు వంటివి ఇప్పుడు పరుగులు పెట్టుకుని వచ్చి మరీ క్యూకట్టుకుని నోట్ల కట్టలతో సొమ్ములు సమకూర్చేందుకు రెడీ అయ్యాయి. ఇప్పుడు మరో రూపంలో అమరావతికి కలిసి వచ్చింది.
అదే భూముల వ్యవహారం. అమరావతిలో ప్రాజెక్టులు వస్తుండడంతో ఇక్కడి రైతులు.. తమ భూములు తీసుకోవాలంటే.. తమ భూములు తీసుకోవాలని.. ప్రభుత్వానికి అర్జీలు పెడుతున్నారు. అంతేకాదు.. తమ భూములను కేవలం భూసమీకరణలోనే(ల్యాండ్ పూలింగ్ విధానం) తీసుకోవాలని పట్టుబడుతూ.. నిరసనలకు కూడా దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం భూములు తీసుకుంటుందంటే.. అడ్డుకునే వారు.. అడ్డుపడే వారు ఎక్కువ.
పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. కోర్టులను ఆశ్రయించేవారు.. కూడా కనిపిస్తారు. గతంలో ఇలానే జరిగింది. కానీ, అమరావతి రాజధాని పరిధిలో ఇప్పటికే 33 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన రైతుల కు ప్రభుత్వం చేస్తున్న మేళ్లను, అదేసమయంలో అమరావతి పుంజుకుంటున్న తీరును గమనించిన రైతులు.. తమ భూములు కూడా ఇస్తామని ముందుకు వచ్చారు. తాజాగా మరో 44 వేల ఎకరాలను తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో రైతులు ఇలా ముందుకు రావడం గమనార్హం.
ఈ పరిణామాల వెనుక రాజధాని పుంజుకోవడం.. పెట్టుబడులు వస్తుండడం.. రైలు, రోడ్డు మార్గాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రబుత్వం రెడీ కావడం.. వంటివి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ భూములు కూడా ఇస్తే.. తాము కూడా అభివృద్ధి చెందుతామని రైతులు భావిస్తున్నారు. సో.. అమరావతికి హైప్ వచ్చిందనడానికి క్షేత్రస్థాయిలో అన్నదాతల నుంచి కనిపిస్తున్న ఈ ఉత్సాహాన్ని మించిన నిదర్శనం మరొకటి కావాలా? అంటున్నారు టీడీపీ నేతలు.