తాను చెడి.. పార్టీని చెరిపి..

గోరంట్ల మాధ‌వ్‌. 2022లో జోరుగా వినిపించిన పేరు. హిందూపురం వైసీపీ ఎంపీగా అప్ప‌ట్లో ఆయ‌న న్యూడ్ వీడియో ఆరోపణల తో అడ్డంగా దొరికిపోయారు. అయితే.. దీనిని స‌మ‌ర్థించుకునేందుకు నానా పాట్లు ప‌డ్డారు. ఇక‌, బీసీ నాయ‌కుడు కావ‌డం.. తాను ఏరికోరి పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేయించి.. పార్టీలో చేర్చుకున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా.. ఆయ‌న‌ను చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. ఫ‌లితంగా వైసీపీకి మ‌హిళా ఓటు బ్యాంకుదూర‌మైంది. అయితే.. ఇప్ప‌టికీ గోరంట్ల తీరు మార‌లేదు.

తాజాగా టీడీపీ స‌స్పెండ్ చేసిన చేబ్రోలు కిర‌ణ్.. జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తిపై దూష‌ణ‌లు చేశాడ‌ని తెలియ డంతో ఆయ‌న‌పై దాడి చేసేందుకు గోరంట్ల హిందూపురం నుంచి హుటాహుటిన విజ‌య‌వాడ‌కు చేరుకుని.. ర‌చ్చ ర‌చ్చ చేశారు. ఇది కిర‌ణ్ కంటే.. గోరంట్ల‌కే పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింది. కిర‌ణ్ ను కొట్టే స‌మ‌యంలో పోలీసుల‌పై దాడికి పాల్ప‌డ్డారంటూ.. ఆయ‌న‌పై కేసుపెట్ట‌డంతో ప్ర‌స్తుతం రాజ‌మండ్రి జైల్లో ఉన్నారు.

ఇక‌, గుంటూరు కోర్టులో హాజరుపర్చే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. దీనిపై విచారణకు గుంటూరు సౌత్‌ డీఎస్పీ భానోదయను నియమించారు. మాధవ్‌ను జీజీహెచ్‌లో వైద్య పరీక్షలకు తీసుకెళ్లినప్పడు అక్కడ ఆయన ఫోన్‌లో మాట్లాడినా బందోబస్తు సిబ్బంది అడ్డు చెప్పలేదు. మీడియా ముందు ప్రవేశపెట్టే ముందు ముసుగు వేసుకోవటానికి నిరాకరించి, తనకే ముసుగు వేస్తారా? అంటూ పోలీసులపై కన్నెర చేశారు.

ఇక‌, కోర్టు వద్ద పోలీస్‌ వాహనంలోంచి దిగి నేరుగా న్యాయస్థానంలోకి వెళ్లిపోయారు. ఇవన్నీ పోలీసుల వైఫల్యమేనని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో ఆ రోజు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐ, ఎస్సైలు, సిబ్బంది నుంచి డీఎస్పీ భానోదయ వాంగ్మూలాలు నమోదు చేశారు. కస్టడీలో ఉన్న వ్యక్తికి మరో వైఎస్సార్సీపీ నాయకుడు ఫోన్‌ తీసుకొచ్చి ఇచ్చినా అక్కడున్న పోలీసులు పట్టించుకోకపోవడంపైనా ఆరా తీసి.. సుమారు ప‌ది మంది పోలీసుల‌ను స‌స్పెండ్ చేశారు. ఏతా వాతా ఈ కిర‌ణ్ ఘ‌ట‌న‌లో గోరంట్ల దూకుడు.. ఆయ‌న‌కే కాకుండా.. పార్టీకి.. పోలీసుల‌కు కూడా.. చిచ్చు పెట్టిన‌ట్టు అయిందన్న చ‌ర్చ సాగుతోంది.