మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు. ఆయన మాటే.. సెటైర్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రాస-యాస కలగలిపి కుమ్మేయడంలో వెంకయ్యను మించిన నాయకుడు లేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆయన ఇదే పంథాలో ముందుకు సాగారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. `అధికారం పోయిందని కొందరు అల్లాడుతున్నారు“ అని పరోక్షంగా వైసీపీ అధినేత జగన్పై విమర్శలు గుప్పించారు. అధికారం శాశ్వత మని అనుకుంటారు. కానీ, ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్నది ఇప్పటి వరకు తనకు కూడా తెలియదని.. ఎన్నికల ఫలితాలు వచ్చాక చూసి ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. అనేక మంది తమకు మించిన పాలన అందించిన వారు లేరని బావిస్తారని.. కానీ.. అది కూడా అహంకారమేనని చెప్పారు.
ప్రజలకు సేవ చేయడంలోనే ముందుకు వస్తే.. అది ఎప్పటికీ విజయాన్ని తీసుకువస్తుందన్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీనే ఉదాహరణగా పేర్కొన్నారు. ఉచితాలు ఇచ్చేసి.. ప్రజలను మభ్యపెట్టినా.. అది ఎంతో కాలం మనలేదని వైసీపీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇక, జమిలి ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. జమిలి ఎన్నికల రాకతో భారతదేశ ముఖ చిత్రం మారిపోతుందన్నారు. ఖజానా కూడా ఆదా అవు తుందన్నారు. ఒకే సారి దేశంలోనూ.. రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతాయన్నారు.
తద్వారా ఒకేసారి పాలన కూడా ప్రారంభమవుతుందని చెప్పారు. దీనిని కొందరు వ్యతిరేక దృష్టితో చూస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలకు జమిలితో ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. ప్రజలకు కూడా సమయం కలిసి వస్తుందని.. ఖజానాకు కూడా ఆదాయమేనని చెప్పారు. జమిలి విషయం అపోహలను ప్రచారం చేయొద్దని వెంకయ్యనాయుడు సూచించారు.