రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక మండలి (ఎస్ఐపీబీ) అనే సంస్థ ఒకటి ఉంటుందని.. అది క్రమం తప్పకుండా సమావేశం అవుతుందని, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పారిశ్రామిక సంస్థలకు ఆ సమావేశం అనుమతులు మంజూరు చేస్తూ ఉంటుందని వైసీపీ పాలనలో విన్నదే లేదు. అయితే ఏపీలో పాలన సాగిస్తున్న కూటమి అదికారం చేపట్టిన 10 నెలల కాలంలోనే ఈ మండలి ఏకంగా 5 సార్లు భేటీ అయ్యింది. దాదాపుగా 8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసింది. దాదాపుగా 4 లక్షలకు పైగా ఉద్యోగాలను రాష్ట్ర యువతకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మార్గం సుగమం చేసింది.
నిజమే మరి…ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ఎస్ఐపీబీ సమావేశాలు ఆరు నెలలకు ఒక సారో, ఏడాదికి ఒక సారో, లేదంటే..అసలు ఆ ఊసే లేకుండానే పాలన సాగిపోతూ ఉంటుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే మాత్రం క్రమం తప్పకుండా ఎస్ఐపీబీ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. అంటే చంద్రబాబు సీఎంగా ఉంటే.. ఆయన పాలనలోని రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతూనే ఉంటాయి. వాటికి అనుమతులు మంజూరు చేసే నిమిత్తం ఎస్ఐపీబీ సమావేశాలు వరుసబెట్టి జరుగుతూనే ఉంటాయి. టీడీపీ అధికారంలో ఉంటే ఈ ప్రాసెస్ నిత్యకృత్యంగా సాగిపోతూ ఉంటుంది.
ఈ క్రమంలోనే చంద్రబాబు అధ్యక్షతన గురువారం కూడా ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. అమరావతి పరిధిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, బీసీ జనార్థన్ రెడ్డి, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాలుపంచుకున్నారు. ఈ సమావేశంలో బాగంగా ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన రూ.31,167 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోద ముద్ర వేసింది. ఈ పెట్టుబడలతో ఏర్పాటు కానున్న పరిశ్రమల ద్వారా రాష్ట్ర యువతకు 32,633 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా ఆయా పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను ఎప్పటిలోగా యూనిట్లను మొదలుపెడతారన్న విషయాన్ని ముందుగానే అడగాలని ఆయన సూచించారు.