డాక్టర్ నుంచి టెర్రరిస్ట్.. అసలు ఎవరీ తహావుర్ రాణా?

2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి భారత దేశ చరిత్రలో మరిచిపోలేని దారుణం. ఆ దాడిలో 170 మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సహకరించిన కీలక కుట్రదారుల్లో తహావుర్ హుస్సేన్ రాణా ఒకరు. పాకిస్తాన్‌ సంతతికి చెందిన ఈ కెనడా పౌరుడు ఆ తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడి నుంచి మొత్తం కుట్రను రహస్యంగా నడిపించాడు. 2009లో అమెరికాలోని ఎఫ్‌బీఐ అతన్ని అరెస్టు చేయగా, భారత్‌ ఆయన్ని అప్పగించాలని జూన్ 2020లో అధికారికంగా అభ్యర్థించింది. 

నాటి నుంచి కోర్టుల్లో సాగిన న్యాయపోరాటానికి ముగింపు పలుకుతూ ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు రాణా అప్పగింతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరిన రాణాను ఎన్ఐఏ అధికారులు తన అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని పాటియాలా న్యాయస్థానానికి హాజరు పరచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాటియాలా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన కేంద్రం, ఈ కేసును వాదించేందుకు నరేందర్ మాన్ అనే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది.

తహావుర్ రాణా ఒకప్పుడు పాక్ ఆర్మీలో డాక్టర్‌గా పనిచేశారు. 1997లో మేజర్ హోదాలో రిటైర్‌ అయి, కెనడా పౌరసత్వం పొందారు. ఆ తర్వాత అమెరికాలో వీసా ఏజెన్సీ ఏర్పాటు చేశారు. అదే సమయంలో డేవిడ్ హెడ్డ్లీతో పరిచయం ఏర్పడి, ఉగ్రకుట్రకు ప్రణాళిక రచనలో భాగమయ్యారు. హెడ్డ్లీకి ప్రయాణ పత్రాలు ఇప్పించడం, ముంబైలో రెక్కీ చేయడానికి సహకరించడం లాంటి కీలక పాత్రను రాణా పోషించారు. ప్రస్తుతం అతని వయసు 63.

ఈ కుట్ర వెనుక పాక్ ఐఎస్ఐ మద్దతు, లష్కరే తోయిబా సంబంధాలపై ఇప్పుడు రాణా మళ్లీ విచారణకు ముందుకొస్తున్నాడు. అతడి విచారణతో ముంబై దాడుల వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రలకు సంబంధించిన నిజాలు వెలుగులోకి రానున్నాయి. తహావుర్ రాణా ప్రస్థానం ఒక డాక్టర్ నుంచి ఉగ్రదాడుల నెపధ్య సూత్రధారిగా మారిన ఉదంతం హాట్ టాపిక్ గా మాఫుతోంది. ఇక పాకిస్తాన్ కనెక్షన్లు కూడా ఈ విచారణలో బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.