జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం ఉదయం ఊహించని పరిణామం ఎదురైంది. సింగపూర్ లో చదువుతున్న ఆయన చిన్నకుమారుడు మార్క్ శంకర్ అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలోనే జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఆయన కాళ్లు, చేతులు కాలిపోయాయి. దీంతో పాఠశాల యాజమాన్యం హుటాహుటీన ఆయనను ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం సింగపూర్ ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స జరుగుతోంది. అయితే ఈ వార్త తెలిసే సమయానికే పవన్ మన్యంలోని అరకు పరిథి గిరిజన గ్రామాల పర్యటనకు వెళ్లారు. దీంతో ఈ పర్యటన ముగించుకున్న తర్వాత తాను సింగపూర్ వెళతానని పవన్ చెప్పడం గమనార్హం.
మార్క్ శంకర్ విద్యాభ్యాసం కారణంగా పవన్ సతీమణి అన్నా లెజినోవా ప్రస్తుతం సింగపూర్ లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు గానీ..మార్క్ శంకర్ కు కాలిన గాయాలయ్యాయి. అంతేకాకుండా మంటల కారణంగా వచ్చిన పొగను పీల్చడంతో మార్క్ శంకర్ శ్వాస సంబంధిత ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే మార్క్ శంకర్ ను సింగపూర్ లోని ఓ ఆసుపత్రికి హుటాహుటీన తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స జరుగుతోంది. ఏడున్నరేళ్ల వయసున్న మార్క్ శంకర్ కు గాయాలు ఏ స్థాయిలో అయ్యాయో తెలియదు గానీ.. డిప్యూటీ సీఎం చిన్న కొడుక్కి కాలిన గాయాలయ్యాయని తెలియడంతోనే సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.
ఇదిలా ఉంటే.. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో రెండు రోజుల పర్యటన నిమిత్తం పవన్ సోమవారమే అరకు వెళ్లారు. తొలి రోజు పర్యటన ముగించుకున్న ఆయన మంగళవారం రెండో రోజు పర్యటననూ ప్రారంభించారు. మార్క్ శంకర్ ప్రమాదం గురించి తెలిసినంతనే… అప్పటికప్పుడే సింగపూర్ బయలుదేరాలని అధికారులు, జనసేన నేతలు ఆయనకు సూచించారు. అయితే అరకు సమీపంలోని కురిడి గ్రామ గిరిజనులకు తాను వస్తానని మాట ఇచ్చానని… దీంతో వారిని కలిసిన తర్వాతే సింగపూర్ వెళతానని పవన్ చెప్పారట. ఇప్పటికే తన టూర్ కు ఏర్పాట్లు జరిగాయి కాబట్టి.. టూర్ ను ముగించుకున్న తర్వాతే సింగపూర్ బయలుదేరతానని చెప్పారట. దీంతో అరకు టూర్ ముగిసిన తర్వాత విశాఖ చేరుకునే పవన్ అక్కడి నుంచే నేరుగా సింగపూర్ వెళతారు. ఈ క్రమంలో విశాఖలో పవన్ టూర్ షెడ్యూల్ ను అధికారులు రద్దు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates