దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు చూస్తుంటే.. కాస్తంత కఠినమైనా ఈ తరహా మాటలే సమాజం నుంచి వినిపిస్తున్నాయి. ఆదివారం వెలుగు చూసిన ఘటన గురించి వింటే…ఈ మాటలు కూడా తక్కువేనేమోనని చెప్పాలి. ఎందుకంటే… సీనియర్ ఇంటర్ చదువుతున్న ఓ బాలికపై 23 మంది మానవ మృగాలు కీలక పర్వాన్ని కొనసాగించాయి. అది కూడా ఏకంగా 7 రోజుల పాటు ఆ దుర్మార్గులు బాధిత బాలికపై అతి కిరాతకంగా వ్యవహరించారు.
ఇంతటి దారుణ ఘటన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో చోటుచేసుకోవడం గమనార్హం. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. వారణాసిలోని పిశాచిమోచన్ ప్రాంతంలోని ఓ హుక్కా సెంటర్ కు బాదిత బాలికను గత నెల 29న ఆమె స్నేహితురాలు తీసుకెళ్లింది. ఈ సందర్భంగా బాధిత బాలికకు మత్తు కలిపిన పానీయం ఇచ్చిన కొందరు ఆమె స్పృహ తప్పగానే.. తమ వెంట తీసుకెళ్లారు. మొత్తం 23 మంది యువకులు బాధిత బాలికను నగరంలోని శిగ్రా ప్రాంతంలోని పలు హోటళ్లకు తిప్పుతూ తమ కీచక పర్వాన్ని కొనసాగించారు.
ఈ క్రమంలో ఈ నెల 4న మత్తు నుంచి మేల్కొన్న బాలిక ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరింది. అప్పటికే తమ కూతురు కోసం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాథిత కుటుంబం తమ కూతురు తిరిగి వచ్చిందని తెలిపింది. అయితే రెండు రోజుల తర్వాత ఈ నెల 6న తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాధిత బాలిక సవివరంగా పోలీసులకు వివరిస్తూ ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డ వారిలో 12 మంది తనకు తెలిసినవారేనని, మిగిలిన వారు తెలియదని తెలిపింది దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తులో భాగంగా మరింత మేర సంచలన విషయాలు వెలుగు చూశాయి.
ఈ విషయాన్ని కాస్తంత సీరియస్ గా తీసుకున్న వారణాసి పోలీసులు నిందితుల కోసం వెనువెంటనే వేట మొదలు పెట్టారు. సోమవారం నాటికే ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే.. బాలిక గుర్తించిన 12 మందిలో ఆమెతో కలిసి చదువుతున్న బాలురు కూడా ఉన్నారట. బాలిక గుర్తు పట్టని నిందితుల కోసం పోలీసులు ఇప్పటికే హుక్కా సెంటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అంతేకాకుండా హుక్కా సెంటర్ సీసీటీవీ ఫుటేజీతో పాటు బాలికను తిప్పిన హోటళ్లు, ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.