ఏపీలోని గిరిజన గూడేలకు రోడ్డు సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన అడవి తల్లి బాట కార్యక్రమాన్ని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పరిధిలోని డుంబ్రిగూడ మండలం పెదపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు గిరిజన గూడేలంటే ఇష్టమని… అందుకే ఇకపై గిరిజన గూడేలకు రోడ్డు సౌకర్యం లేదన్న మాటే వినిపించకూడదన్న భావనతోనే అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టామన్నారు.
ఇకపై డోలీ మోతలు ఉండవని ప్రకటించిన పవన్… ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,005 కోట్లతో 1,069 కిలో మీటర్ల మేర రోడ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ రోడ్లతో రాష్ట్రంలోని రోడ్డు సౌకర్యం లేని గిరిజన గూడేల్లో 601 గూడేలకు రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక మిగిలిన 500 పై చిలుకు గూడేలకు వచ్చే ఏడాది రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా వైసీపీ పాలనను గుర్తు చేసిన పవన్… ఐధేళ్ల వైసీపీ పాలనలో కేవలం 90 కోట్లనే గిరిజన గూడేల రోడ్లకు కేటాయించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా కాకుండానే రూ.1,005 కోట్ల నిధులను గిరిజన గూడేల రోడ్లకు కేటాయించామన్నారు. భవిష్యత్తులో గిరిజన గూడేల రూపూరేఖలను సమూలంగా మారుస్తామని ఆయన చెప్పారు. గిరిజన గూడేలకు రోడ్డు సైౌకర్యం కోసం అడిగిన వెంటనే సీఎం నారా చంద్రబాబునాయుడు నిధులు విడుదల చేశారని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి మెజారిటీ నిధులను సేకరించామని, రాష్ట్ర ప్రభుత్వం తన గ్రాంట్ గా కొంత మేర నిధులను కూడా కేటాయించిందన్నారు. ఇప్పటికే ఈ పనులకు సంబందించిన టెండర్ల ప్రక్రియను ప్రారంభించామని పవన్ చెప్పారు. ఏదో చెప్పడం, ఆ తర్వాత మరిచిపోవడం కాకుండా.. అతి త్వరలోనే ఈ పనులను ప్రారంభించడంతో పాటుగా నిర్ధీత కాల వ్యవధిలోగా పూర్తి చేస్తామని కూడా ఆయన చెప్పారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అరకులో కూటమికి ఒక్క సీటు కూడా రాలేదని పవన్ గుర్తు చేశారు. వైసీపీని నమ్మి వారికి ఓటేస్తే… ఐదేళ్ల పాటు వారు అరకును విస్మరించారని ఆయన అన్నారు. కూటమికి ఓటు వేయకున్నా అరకు అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కదులుతున్నామని తెలిపారు. ఈ అభివృద్ధి చూసి అయినా వచ్చే ఎన్నికల్లో అరకు మొత్తంలో కూటమి జెండాలు రెపరెపలాడాలని ఆయన అభిలషించారు. కూటమిని ఆశీర్వదిస్తే అభివృద్ధి దానంతటదే వస్తుందన్నారు.
కూటమి ఇంకో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఎలాగైతే 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతుందో… ఏపీలోనూ కూటమి పాలన 15 ఏళ్ల పాటు కొనసాగుతుందన్నారు. ఏడాది తిరక్కుండానే తాము చేస్తున్న పనులను చూసైనా అరకు జనం వచ్చే ఎన్నికల్లో కూటమికి ఓటేస్తారని తాను విశ్వసిస్తున్నానని పవన్ అన్నారు. పెదపాడులో సోమవారం పర్యటన ముగించుకుని విశాఖ వెళ్లనున్న పవన్… మంగళవారం కూడా అరకు మండలం సుంకరమెట్టకు వెళ్లనున్నారు అక్కడ కొత్తగా నిర్మించిన ఉడెన్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించనున్నారు.