నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి నిధుల కష్టాలు తొలగిపోయాయి. అమరావతిలోని ప్రధాన భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, అసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రూ.15,000 కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల నిధుల మంజూరు అయ్యాయి. అదే సమయంలో కేంద్రం తన వాటా కింద అమరావతికి రూ.1,500 కోట్ల నిధులను ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిధులు… ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల రుణాల్లో కలిసే ఉంటాయి. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు తన తొలి విడత రుణం రూ.3,535 కోట్లను ఇప్పటికే విడుదల చేయగా… తాజాగా కేంద్రం తన వాటాగా ఒప్పుకున్న రూ.1,500 కోట్ల నుంచి తొలి విడత నిధుల కింద రూ.750 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు ఇప్పటికే రాష్ట్ర ఖజానాకు చేరాయి. వెరసి ఇప్పటిదాకా అమరావతికి రూ.4,285 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి.
టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికార పగ్గాలు చేపట్టినంతనే… అమరావతి నిర్మాణాన్ని ఈ ఐదేళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనే పూర్తి చేసి తీరాలన్న ఉక్కు సంకల్పంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ వ్యూహంతో రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను కలిసిన చంద్రబాబు… అమరావతి నిర్మాణాన్ని తాము ఓ అంతర్జాతీయ స్థాయి నగరం స్థాయిలో చేపడుతున్నామని తెలిపారు. చంద్రబాబు ప్రజెంటేషన్ తో ప్రపంచ బ్యాంకు కొంతమేర సానుకూలత వ్యక్తం చేయగా… చంద్రబాబు నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లారు. ప్రపంచ బ్యాంకు రుణం గురించి ఆయన మోదీతో చర్చించారు. అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు ఇవ్వదలచిన రుణానికి గ్యారెంటీ ఇచ్చేందుకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందానికి తెలియజేశారు.
చంద్రబాబు ప్రతిపాదనలు, అమరావతి రుణానికి కేంద్రం గ్యారెంటీ ఇవ్వనున్న విషయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రపంచ బ్యాంకు… తనతో పాటు అమరావతికి రుణం ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకును కూడా ఒప్పించింది. ఈ క్రమంలో మొత్తంగా రూ.15 వేల కోట్ల రుణాన్ని అమరావతికి ఇచ్చేందుకు ఆ రెండు బ్యాంకులు ఒప్పుకుని… అందులో 10 శాతం నిధులు అంటే.. రూ.1,500 కోట్లను కేంద్రం ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా దశలవారీగా అనుమతులన్నీ వచ్చేయగా… ఇటీవలే ప్రపంచ బ్యాంకు తన రుణంలోని తొలి విడత నిధుల కింద రూ.3,535 కోట్లను ఇటీవలే విడుదల చేసింది. ఇదే విషయాన్ని ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ క్రమంలో కేంద్రం తన వాటాలోని రూ.750 కోట్లను కూడా ప్రపంచ బ్యాంకు నిధులకు జత చేస్తూ మొత్తం రూ.4,285 కోట్లను రాష్ట్ర ఖాతాలోకి జమ చేసింది. ఇక ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి తొలి విడత రుణం విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, కేంద్రం వాటా నిధులు ఏపీకి విడుదలైన నేపథ్యంలో అతి త్వరలోనే ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం నిధులు కూడా అమరావతికి అందనున్నాయి.