జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు రెండో రోజు శనివారం కూడా.. పిఠాపురంలో పర్యటించారు. శుక్రవారం పిఠాపురానికి వెళ్లిన ఆయన.. అన్న క్యాంటీన్ను ప్రారంభించి.. పలువురికి భోజనాలు వడ్డించిన విషయం తెలిసిందే. తాజాగా రెండో రోజు కూడా.. అక్కడే ఉండి.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబరులో ఒకే రోజు చేపట్టిన పల్లె పండుగ
కార్యక్రమం కింద నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన గ్రామీణ రోడ్లను శనివారం నాగబాబు ప్రారంభించారు.
అదేవిధంగా పిఠాపురం మండలం, కుమారపురం హౌసింగ్ లే అవుట్ –1లో రూ.15.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కూడా ప్రారంభించారు. అలానే.. విరవ గ్రామం నుంచి గోకివాడ బ్రిడ్జి వరకు యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ. 75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. వచ్చే నాలుగేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు ఈ సందర్భంగా నాగబాబు తెలిపారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొన్ని రహదారుల పనులను కూడా నాగబాబు పరిశీలించారు. ఈ సందర్భం గా స్థానికులను ఉద్దేశించి నాగబాబు మాట్లాడుతూ.. పిఠాపురాన్ని వచ్చే నాలుగేళ్లలో ఐకాన్ సిటీగా మా ర్చేందుకు పవన్ కల్యాణ్ కృత నిశ్చయంతో ఉన్నారు. దీనికి అందరూ సహకరించాలి
అని వ్యాఖ్యానిం చారు. తాను రాజకీయాలు చేసేందుకు రాలేదని.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు మాత్రమే వచ్చానని నాగబాబు చెప్పారు. రాజకీయాలు చేసేందుకు నాలుగు సంవత్సరాల సమయం ఉందని పరోక్షంగా ఆయన కొందరు నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.