వైసీపీ ప్రభుత్వం పర్యాటక, యువజన శాఖల విషయంలో అప్పటి మంత్రులు తీసుకున్న నిర్ణయాలు.. ఇచ్చిన జీవోలపై పునః సమీక్షకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. వీటిని పునః పరిశీలించి నిర్ణయం తీసుకునేలా తాజాగా జరిగిన మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. దేశంలో డ్రోన్ వ్యవస్థకు జవసత్వాలు ఇవ్వాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వ బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. వచ్చే రెండేళ్లలో డ్రోన్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేసింది.
ఈక్రమంలో తాజాగా గురువారం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేక ‘ఏపీ డ్రోన్ కార్పొరేషన్’ ఏర్పాటుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి స్వయం ప్రతిపత్తికల్పించారు. తద్వారా.. మహిళలు, నిరుద్యోగులకు డ్రోన్ ల ద్వారా ఉపాధి కల్పించే అవకాశం మెరుగు పడనుంది.
ఇక, ఇప్పటి వరకు ఏపీ డ్రోన్ వ్యవస్థ.. స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్)లో భాగంగా ఉండేది. అయితే.. ఈ రెండు వ్యవహారాలు భిన్నమైన అంశాలు కావడంతో సర్కారు.. ఈ రెండింటిని విడదీసింది. మరోవైపు.. వైసీపీ హయాంలో యువజన, పర్యాటక శాఖలు జారీ చేసిన జీవోలను పునః పరిశీలించేందు కు(ర్యాటిఫికేషన్)కు కూడా మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే.. అనకాపల్లి జిల్లాలో పెట్టుబడులకు అనుమతులు తెలిపింది. దీంతో డీఎల్పురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటు కానుంది.
కీలకమైన మరో నిర్ణయానికి వస్తే.. కొన్నాళ్లుగా డిమాండ్గా ఉన్న బార్ల లైసెన్సు ఫీజులను ప్రభుత్వం కుదించింది. ప్రస్తుతం 50 నుంచి 75 లక్షల వరకు ఉన్న(ప్రాంతాన్ని బట్టి) త్రీ స్టార్ హోటళ్లు, 5 నక్షత్రాల హోటళ్లలోని బార్లకు ఫీజులను రూ.25 లక్షలకు తగ్గిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేదల ఇంటి నిర్మాణానికి కూడా సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. పేదల ఇళ్లు నిర్మించే హడ్కో కు 710 కోట్లను ప్రభుత్వ గ్యారెంటీతో రుణం అందించేందుకు కేబినెట్ నిర్ణయించింది.