జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, పార్టీ కీలక నేత కొణిదెల నాగేంద్ర బాబు బుధవారం శాసన మండలి సభ్యుడిగా పదవీ ప్రమాణం చేశారు. అమరావతిలోని ఏపీ శాసనసభా ప్రాంగణంలోని శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. దీంతో ఎమ్మెల్సీగా నాగబాబు శాసన మండలిలోకి ప్రవేశించడానికి ఉన్న ఆ ఒక్క లాంఛనం కూడా పూర్తి అయిపోయింది. ఇటీవలే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబుకు టికెట్ దక్కిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో నాగబాబు ఏకగ్రీవంగానే ఎమ్మెల్సీగా ఎంపిక కాగా.. బుధవారం ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇటీవలే ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అందుబాటులోకి రాగా.. అన్నింటినీ కూటమి పార్టీలే చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. కూటమి రథ సారథిగా ఉన్న టీడీపీ మూడు సీట్లను తీసుకుని.. మిత్రపక్షాలు అయిన బీజేపీ, జనసేనలకు ఒక్కో సీటును కేటాయించిన సంగతి తెలిసిందే. జనసేన తరఫున నాగబాబు, బీజేపీ తరఫున సోము వీర్రాజులను ఆ పార్టీలు ఎంపిక చేయగా.. టీడీపీ తరఫున కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్రలకు అవకాశం దక్కింది. సరిపడ సంఖ్యాబలం లేని కారణంగా వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండగా.. వీరంతా ఏకగ్రీవంగానే ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో నాగబాబుతో పాటు మిగిలిన వారు కూడా బుధవారమే ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు.
మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉన్నా… నాగబాబును ఎమ్మెల్సీగా చేసిన తర్వాత ఆయనను కేబినెట్ లోకి తీసుకుందామని ఇదివరకే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అందుకు పవన్ కూడా ఓకే చెప్పారు. ఈ క్రమంలో ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికవడం, శాసన మండలి సభ్యుడిగా పదవీ ప్రమాణం కూడా చేయడం పూర్తి అయిపోయింది. ఇక మిగిలినది ఆయనను కేబినెట్ లోకి తీసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. అది ఎప్పుడు జరుగుతుందన్నదానిపై జనసేనలో చర్చ జరుగుతోంది. మొన్నటిదాకా నాగబాబు ఇంకా మండలిలోకి అడుగు పెట్టలేదు కాబట్టి.. ఈ చర్చకు ఆస్కారం లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణం కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఆయన మంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపడతారన్న దానిపై చర్చకు తెర లేసింది.