వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. గన్నవరం స్థానిక కోర్టు.. ఒక్కరోజు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో విజయవాడకు వచ్చిన గన్నవరం పోలీసులు.. ఇక్కడి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని అదుపులోకి తీసుకుని.. కంకిపాడు పోలీసు స్టేషన్కు తరలించారు. తొలుత ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు నిర్ధారించుకున్నారు.
అనంతరం. కంకిపాడు పోలీసు స్టేషన్కు తరలించిన పోలీసులు.. వంశీని విచారిస్తున్నారు. కాగా.. మధ్యాహ్నం సమయంలో భోజనం ఏర్పాటు చేయాలన్న కోర్టు ఉత్తర్వుల మేరకు.. పోలీసులు వంశీకి స్టార్ హోటల్ నుంచి భోజనాన్ని సమకూర్చారు. అయితే.. తనకు మంచినీళ్లు చాలని.. భోజనం వద్దని వంశీ వారించారు. దీంతో పోలీసులు ఆయనకు కొబ్బరి బోండం నీళ్లను అదించారు. అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ఇచ్చారు. డ్రైఫ్రుట్స్ను ఇష్టంగా తినే వంశీకి వాటిని కూడా అందించారు.
ఏంటీ కేసు?
ఉమ్మడి కృష్నాజిల్లా ఆత్కూరు మండలంలో శ్రీధర్రెడ్డి అనే వ్యక్తికి పూర్వీకుల నుంచి ఆస్తి సంక్రమించింది. ఈ భూమి ప్రధాన రహదారిని ఆనుకుని ఉండడంతో భారీ ఎత్తున ధరలు పలుకుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన కొందరు వ్యక్తులు.. దీనిని ఆక్రమించారు. అనంతరం.. అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న వంశీ సాయంతో దీనిని వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. కుట్ర పూరితంగా వ్యవహరించారని.. బాధితుడు శ్రీధర్రెడ్డి చెబుతున్నారు.
ఈ కుట్రకు ప్రధాన రూపకర్త, నిందితులను కూడా దాస్తున్న మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్టు చేసి విచారించాలన్న శ్రీధర్రెడ్డి డిమాండ్. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు పెట్టి.. తాజాగా ఒకరోజు కస్టడీకి తీసుకు న్నారు. ఈ కేసు వెనుక జిల్లాకు చెందిన కొందరు నాయకులు ఉన్నారని అనుమానిస్తున్నారు. వంశీని విచారించడం ద్వారా ఆయా వివరాలను రాబట్టుకోవచ్చని పోలీసులు చెబుతుండడం గమనార్హం.