నీచ రాజకీయాలకు దూరం… లేదంటే వారు జైల్లో ఉండేవారు: రేవంత్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం నాటి సమావేశాల్లో బాగంగా కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న రేవంత్.. కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో తనను ఎన్నో ఇబ్బందులు పెట్టిన వైనాన్ని రేవంత్ గుర్తు చేశారు. అయితే తాను ఆ తరహా నీచ రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ఆయన తెలిపారు. అలా కాని పక్షంలో కేటీఆర్ సహా చాలా మంది చంచల్ గూడ జైల్లో ఊచల లెక్కపెడుతూ ఉండేవారని ఆయన అన్నారు.

కక్షపూరిత రాజకీయాలకు తాను దూరంగా ఉంటున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతల మాదిరిగా తాను కూడా కక్షపూరిత రాజకీయాలు చేసి ఉంటే.. ఇప్పటికే కేటీఆర్ జైల్లో ఉండేవారని ఆయన అన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే రూ.500 ఫైన్ వేస్తారన్న రేవంత్… తనపై డ్రోన్ ఎగురవేశానన్న కారణంతో ఏకంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆయన ఆరోపించారు. ఆ సందర్భంగా తన కుమార్తె వివాహానికి కూడా బెయిల్ పై వచ్చి తిరిగి జైలుకు వెల్లాల్సి వచ్చిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రతీకార రాజకీయాలను తాను ఎప్పుడో వదిలేశానని కూడా రేవంత్ అన్నారు. కేసీఆర్ తో పాట కేటీఆర్ ను జైలుకు పంపాలని చాలా మంది అడుగుతున్నారన్న రేవంత్.. తాను మాత్రం వారి మాదిరిగా అక్రమ కేసులతో జైళ్లకు పంపే నీచ రాజకీయాలు చేయలనని తెలిపారు.

అనంతరం సాగు నీటి ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన వంటి అంశాలపై చర్చ జరగగా.. అందులో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాజెక్టులను కేసీఆర్ తన ఫామ్ హౌజ్ ల కోసమే కట్టుకున్నారని రేవంత్ సంచలన ఆరోపణలు గుప్పించారు. లగచర్ల అంశంలో రైతులకు మెరుగైన ప్యాకేజీని ప్రతిపాదించామని ఆయన అన్నారు. అయితే కేవలం రాజకీయ కారణాలతో అక్కడి బీఆర్ఎస్ నేత నరేందర్ రెడ్డి రైతులను రెచ్చగొట్టే యత్నం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరెవరికి ఎన్నెన్ని ఫామ్ హౌజ్ లు ఉన్నాయన్న విషయాన్ని తేల్చేందుకు సర్వే చేద్దామా? అని కూడా రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. తాను తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోందన్న రేవంత్… రైతులు, రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటం చేసే గురుతర బాధ్యతను బీఆర్ఎస్ ఎప్పుడో వదిలేసిందని ఆరోపించారు.