కేటీఆర్ నోట జగన్ మార్కు డైలాగ్

ఏపీలో వైసీపీ విపక్ష స్థానంలోరి మారిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ కూడా 6 నెలలకు ముందుగానే విపక్షంలోనే మారిపోయింది. విడదీయ లేనంత మైత్రీబందంతో సాగుతున్న ఈ పార్టీలకు పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ శ్రేణులను కాపాడుకునే బాధ్యత అధిష్ఠానం మీదే ఉంటుంది. అందులో భాగంగా పెద్ద సంఘటన జరిగినప్పుడు ఆయా ఘటనలపై స్పందిస్తున్న ఇరు పార్టీల అధినేతలు ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. ప్రత్యేకించి తమ పార్టీ శ్రేణుల మీద కేసులు నమోదు చేసే పోలీసు శాఖ, ఆ శాఖ అధికారులపై ఈ రెండు పార్టీల నేతలు విరుచుకుపడుతున్నారు.

తెలంగాణలో జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశాల కోసం కేటీఆర్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆదివారం ఆయన కరీంనగర్ వెళ్లారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన సందర్బంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారులు ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని… ఇప్పుడు కేసులు పెట్టిన అధికారులు అప్పుడు విదేశాలకు వెళ్లినా గానీ వదిలిపెట్టేది లేదని, వారిని తిరిగి రప్పించి చట్టపరంగా శిక్షలు అమలు చేస్తామని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా తాను పార్టీ అధినేత కేసీఆర్ అంత మంచోడిని కాదని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కేటీఆర్ నోట ఈ మాట విన్నంతనే… ఏపీలోని విపక్షం వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డే గుర్తుకు వచ్చారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే… ఏపీలో వైసీపీ శ్రేణులపై కూటమి సర్కారు ఆదేశాల మేరకు పోలీసు అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని జగన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టే అధికారులను గుర్తు పెట్టుకుంటామని… తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారు సప్త సముద్రాల ఆవల ఉన్నా తిరిగి రప్పిస్తామని జగన్ హెచ్చరించారు. ఇప్పుడు విదేశాలకు పారిపోయినా తిరిగి రప్పిస్తామంటూ కేటీఆర్ అన్నంతనే నాడు జగన్ అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.