నియోకజవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో డీఎంకే అదినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం చెన్నై వేదికగా ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. డీఎంకే మంత్రులు, ఎంపీలను పంపి మరీ… ఆయా పార్టీల నేతలకు స్టాలిన్ ఆహ్వానాలు అందేలా చూశారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. శుక్రవారం సాయంత్రమే ఆయన శంషాబాద్ నుంచి చెన్నై బయలు దేరనున్నారు. ఈ భేటీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరవుతున్నారు.
స్టాలిన్ భేటీని తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్వాగతించింది. స్టాలిన్ భేటీకి తాము హాజరవుతామని ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు కూడా. అయితే చెన్నై వెళ్లే వారెవరు అన్న విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని ఆయన మొన్న వెల్లడించారు. తాజాగా భేటీ సమయం దగ్గరపడిన వేళ… చెన్నైలో శనివారం జరగనున్న సదరు భేటీకి తానే స్వయంగా హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. అనుకోవడమే కాకుండా ఏకంగా శుక్రవారం రాత్రి ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏకంగా చెన్నై ఫ్లైట్ ఎక్కేశారు. కేటీఆర్ వెంట పార్టీ నేతలు జగదీశ్ రెడ్డి, వినోద్ కుమార్, నిరంజన్ రెడ్డిలు చెన్నై వెళ్లారు.
దక్షిణాది రాష్ట్రాల తరఫున కేంద్రానికి దక్షిణాది వాణిని బలంగా వినిపించే దిశగా సాగుతున్న ఈ భేటీలో కేటీఆర్, రేవంత్ కే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. పిన్న వయసులోనే కీలక పదవులను అలంకరించిన వీరిద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కూడా ఓ రేంజిలో సాగుతున్న సంగతి తెలిసిందే. నిత్యం మాటల తూటాలు పేల్చుకుంటున్న ఈ ఇద్దరు నేతలు అనూహ్యంగా ఓ కీలక విషయంపై ఒకే మాటగా ఒకే బాటగా సాగేందుకు నడుం బిగించడాన్ని చూస్తుంటే… నిజంగానే వీరిద్దరే శనివారం నాటి భేటీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారని చెప్పక తప్పదు.